నాగర్కర్నూల్, మే 23 (నమస్తే తెలంగాణ) : జూనియర్ పంచాయతీ కార్యదర్శులకూ సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. జేపీఎస్ సర్వీసును క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. కొన్నేండ్లుగా ఎదురు చూస్తున్న రెగ్యులరైజ్ ఆకాంక్షను నెరవేరుస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో గ్రామాల అభివృద్ధిలో కీలకంగా మారిన జేపీఎస్లు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరణకు నోచుకోనున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాను ముఖ్యమంత్రి ఆదేశించారు. వారి పనితీరు మదింపునకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని ఆదేశించారు. త్వరలో మార్గదర్శకాలు వెలువడనుండగా.. రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ లేకుండా చేస్తానన్న హామీ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని వేయి మందికిపైగా జేపీఎస్ల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఆయా మండలాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తూ సంబురాలు జరుపుకొంటున్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్) ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. గ్రామాల్లో పని చేస్తున్న జేపీఎస్లను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో పంచాయతీరాజ్ శాఖ క్రమబద్ధీకరణకు చర్యలు చేపడుతున్నది. ఈ మేరకు విధివిధానాలను రూపొందించేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు తీసుకోనున్నది. దీనికిగానూ కలెక్టర్ల ఆధ్వర్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా అటవీ శాఖాధికారి, ఎస్పీలు సభ్యులుగా కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఈ కమిటీల నివేదిక ఆధారంగా జేపీఎస్ల రెగ్యులరైజ్ చేపడతారు. జేపీఎస్లుగా 2019లో ఉద్యోగాల్లో చేరారు. నాటి నుంచి రెగ్యులరైజ్ కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ చిరు ఉద్యోగులతోపాటు వివిధ శాఖల ఉద్యోగులకు ఇచ్చిన మాటను క్రమంగా అమలు చేస్తూ వస్తున్నారు. ఇటీవలే రాష్ట్రంలో దాదాపుగా 10వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. ఇదే క్రమంలో తాజాగా వీఆర్ఏలను క్రమబద్ధీకరించేందుకు ఉత్తర్వులివ్వగా అధికారులు చర్యలు చేపట్టారు.
తాజాగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను సైతం రెగ్యులర్ చేసేందుకు సీఎం రెండు రోజుల కిందట నిర్ణయించడం విశేషం. ఇలా రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ లేకుండా చేస్తానన్న హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టడంలో పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర. ఇందులో జేపీఎస్లు కూడా ఇతర కార్యదర్శుల్లాగే నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. గ్రామాల్లో పారిశుధ్య చర్యలు మొదలుకొని పన్నుల వసూళ్లు చేపట్టడం, హరితహారం, వన నర్సరీ, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాల నిర్వహణ చేపడుతున్నది. సీజనల్ వ్యాధులను అరికట్టడంలో కార్యదర్శులు వైద్య, ఇతర శాఖలకు తలలో నాలుకగా వ్యవహరిస్తున్నారు. వృద్ధులకు పింఛన్లు తీసుకోవడానికి వేలిముద్రలు రాని పరిస్థితుల్లో కార్యదర్శులే డబ్బులు డ్రా చేసి ఇస్తున్నారు.
అలాగే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, నర్సరీలు, మొక్కల సంరక్షణ, రైతుభీమా క్లెయిమ్ దరఖాస్తు పత్రాలు, ఇంటి నిర్మాణాలు, లే అవుట్ల అనుమతులు వంటి పనులన్నీ కార్యదర్శులే చేపడుతున్నారు. గ్రామాల్లో స్వచ్ఛ పురస్కారాలకు ఎంపికవడంతో జాతీయ స్థాయిలోనూ రాష్ర్టానికి ఈ ఉద్యోగులు చేస్తున్న కృషి కూడా కారణంగా నిలుస్తున్నది. దీంతో ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించేందుకు సీఎం నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేయి మందికిపైగా జేపీఎస్లు త్వరలో రెగ్యులర్ ఉద్యోగులు కానున్నారు. సీఎం నిర్ణయంతో జేపీఎస్ కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ఆయా మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తూ సంబురాలు చేసుకొంటున్నారు.
త్వరలో విధివిధానాలు ఖరారు..
ప్రభుత్వం జేపీఎస్ల క్రమబద్ధీకరణపై విధివిధానాలను రూపొందిస్తున్నది. కలెక్టర్ ఆధ్వర్యంలోని క మిటీ జిల్లాలోని జేపీఎస్ల రెగ్యులరైజ్కు చర్యలు తీసుకుంటుంది. నా గర్కర్నూల్లో 311మంది జేపీఎస్ లు పనిచేస్తున్నారు. త్వరలో రెగ్యులరైజ్కు చర్యలు తీసుకుంటాం.
– మనూచౌదరి, అదనపు కలెక్టర్, నాగర్కర్నూల్