వనపర్తి, మే 22 : విద్యార్థులు క్రీడల్లోనూ ప్రావీణ్యం పెంచుకొని రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాలకిష్టయ్య క్రీడామైదానంలో సోమవారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ రక్షితామూర్తితో కలిసి సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడాపోటీలను ప్రారంభించారు. ముందుగా క్రీడాజ్యోతిని వెలిగించి పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు ఎంతోమంది రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్రం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ రోడ్డులో 10ఎకరాలు, బాలకిష్టయ్య క్రీడామైదానం, పాలిటెక్నిక్ కళాశాల మైదానం, మర్రికుంట సమీపంలో స్పోర్ట్స్ క్లాంపెక్స్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. క్రీడలు ఆరోగ్యంతోపాటు మానసిక ఉల్లాసం, మంచి వ్యక్తిత్వాన్ని ఇస్తాయన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు.
ఇష్టమైన క్రీడను ఎంచుకుని శ్రద్ధ పెట్టి ఆడాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఆటలు ఆడి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని తెలిపారు. వనపర్తి జిల్లాలో రాబో యే మూడేండ్లల్లో జనాభా 1.5లక్షలు దాటే అవకాశం ఉందని, ఇక్కడ మెడికల్, ఫార్మసి, ఇంజినీరింగ్ కళాశాలలతో ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి విద్యార్థులు వస్తున్నారని.. అందుకు అనుగుణంగా స్పోర్ట్స్ క్లాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాగా సీఎం కప్ జిల్లాస్థాయి పోటీల్లో 14 మండలాల నుంచి 700 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. వాలీబాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింట న్, స్విమ్మింగ్ వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి అందరికీ ఆదర్శంగా నిలువాలని ఎస్పీ రక్షితామూర్తి క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఎఫ్వో నవీన్రెడ్డి, డీఎస్పీ ఆనంద్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, జిల్లా యువజన, క్రీడల అధికారి సుధీర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, ఆర్డీవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు.