మక్తల్ టౌన్ మే 9 : మున్సిపాలిటీ అభివృద్ధ్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం మక్తల్ మునిపాలిటీ అభివృద్ధిపై ఎమ్మెల్యే చిట్టెం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో టీఎఫ్ఐడీసీ నిధుల నుంచి రూ.5కోట్ల నిధులు తీసుకురాగా, బీజేపీకి చెందిన నాయకులు కోర్టుకు వెళ్లి పనులు నిలుపుదల చేయాలని కేసు వేసినప్పటికీ వారి చెంప చెల్లుమనేలా మున్సిపాలిటీలో అభివృద్ధ్ది పనులు చేపట్టామన్నారు. మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని, రాష్ట్ర ప్రభుత్వమే 75శాతం నిధులను మంజూరు చేసిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం టీఎఫ్ఐడీసీ నిధులు రూ.4.95కోట్లతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతామని తెలిపారు. రూ.2.50కోట్లతో పబ్లిక్ హెల్త్, రూ.1.95కోట్లు పంచాయతీరాజ్, రూ.50లక్షలు ఇరిగేషన్, పట్టణంలోని ఎల్లమ్మకుంట నుంచి మక్తల్ చెరువు వరకు రూ.2.90కోట్లు, ఆజాద్నగర్ నుంచి రూ.1.90కోట్లతో డ్రైనేజీల నిర్మాణం చేపడుతామని వివరించారు. అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గుప్త, రాజేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, చిన్న హన్మంతు, వాకిటి హన్మంతు, ఆంజనేయులు, శ్రీహరి, నేతాజీ, ఈశ్వర్, బండారి శేఖర్, సాగర్ నాయకులు పాల్గొన్నారు