గద్వాల, మార్చి 20: అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అనే చందంగా మారింది గద్వాల జిల్లాలోని ప్రతిపక్షాల తీరు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు 90శాతం పూర్తి కాగా 10శాతం పనులు మిగిలాయి. ఆ పనులను పూర్తయితే అటు అలంపూర్, ఇటు గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలానికి పుష్కలంగా నీరందుతుంది. అదేవిధంగా రిజర్వాయర్ వల్ల నీటినిల్వలతో భూగర్భజలాలు పెరిగి వేసవిలో జీవాలకు సమృద్ధిగా నీరు అందుబాటులో ఉంటుదనే ఉద్దేశంతో ప్రభుత్వం పనులు ప్రారంభిస్తే.. ప్రతిపక్షాలతోపాటు కొందరు చిన్నోనిపల్లి గ్రామస్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ రిజర్వాయర్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని.. అసలు ఆయకట్టే లేదని చెబుతూ పనులు నిలిపి వేయాలని, ప్రతిపక్షాలు నిర్వాసిత రైతుల పక్షాన మొసలి కన్నీరు కార్చుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత ప్రతిపక్ష నేత.. బీజేపీలో ఉన్న వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సమయంలోనే ఈ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు. చిన్నోనిపల్లి, సంగాల రిజర్వాయర్ పనులను కమీషన్ల కోసం అప్పటి పాలకులు అడ్డు కోవడం వల్లే వాటి నిర్మాణాలు నిలిచిపోయాయి. తర్వాత సంగాల రిజర్వాయర్ పనులు పూర్తయింది. ప్రతిపక్షాల అనవసరపు లొల్లి, గ్రామస్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం వల్లే పనుల వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంతేగానీ గ్రామాన్ని పోలీసులు దిగ్బంధంలో ఉంచలేదు. కొన్నిపత్రికలతోపాటు ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తూ గోరంతను కొండంత చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గత పాలకులు ఈ రిజర్వాయర్ను పూర్తిచేసి ఉంటే ప్రస్తుతం నిర్వాసితులకు ఇబ్బందులుండేవి కాదు.
ముంపునకు గురైన భూములు..
2005లో 101 ప్యాకేజీ కింద 2,500 ఎకరాల భూసేకరణ చేశారు. బోయలగూడెం పరిధిలో 274 ఎకరాలు సేకరించి పరిహారం కింద రూ.2,25,91, 444, చాగదోణ పరిధిలో 1,150 ఎకరాల భూసేకరణ చేసి పరిహారం కింద రూ.12,97,48,621, ఇందువాసి పరిధిలో 712 ఎకరాలు సేకరించి రూ.5,59,66,229 పరిహారం ఇచ్చారు. చిన్నోనిపల్లి ముంపునకు గురికాగా 251 ఇండ్లకు రూ.6,35,32,096 నష్టపరిహారం అందించారు.
రిజర్వాయర్ వివరాలు..
నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకంలో భాగంగా 101 ప్యాకేజీలో గట్టు మండలం చిన్నోనిపల్లి వద్ద 1.59టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణాకి 2,500 ఎకరాల భూసేకరణ చేసి రైతులను పరిహారం చెల్లించారు. 2006లో పనులు మొదలు పెట్టగా పరిహారం సరిపోవడం లేదని రైతులు కోర్టుకు వెళ్లడంతో రెండో విడుతలో రూ.14.82,34,357 ప్రభుత్వం చెల్లించింది. చిన్నోనిపల్లిలో నిర్వాసితులు 360మంది ఉండగా 336మందికి ఇండ్లపట్టాలు ఇచ్చామని, మిగిలిన వారికి త్వరలో పట్టాలు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. పరిహారం ఇచ్చినప్పటికీ నిర్వాసితులను అక్కడ నుంచి ఖాళీ చేయించడంలో అధికారులు విఫలం కావడంతో ఈ పరిస్థితి నెలకొందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రిజర్వాయర్ నిర్మాణం వల్ల ఎటువంటి నష్టం రాదని అధికారులు చెబుతున్నా నిర్వాసితులు ప్రతిపక్షాల మాటలతో ఆందోళన చెందుతున్నారు.
ఆయకట్టు లేనప్పుడు రిజర్వాయరెందుకు?
అక్కడ ఆయకట్టు లేదని, అలాంటప్పుడు రిజర్వాయర్ నిర్మాణం అవసరం లేదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అక్కడ ఆయకట్టు లేనప్పుడు గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి రిజర్వాయర్ ప్రతిపాదన ఎందుకు చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారి కమీషన్ల కోసం చిన్నోనిపల్లి రిజర్వాయర్తోపాటు సంగాల రిజర్వాయర్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
రిజర్వాయర్ నిర్మిస్తే..
చిన్నోనిపల్లి రిజర్వాయర్ సామర్థ్యం 1.59టీఎంసీలు. దీని ద్వారా 15వేల ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. విపత్కర పరిస్థితుల్లో చిన్నోనిపల్లి రిజర్వాయర్ ద్వారా నెట్టెంపాడ్ పరిధిలో 3వేల ఎకరాలకు, ఆర్డీఎస్ పరిధిలో 12,500 ఎకరాలకు సాగునీరు అందించొచ్చు. రిజర్వాయర్లోని నీటిని ఎగువన ఉన్న రైతులు పంపింగ్ ద్వారా వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇందువాసి, బోయలగూడెం గ్రామాల రైతులకు సాగునీటితోపాటు అత్యవసర సమయంలో నెట్టెంపాడ్, ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించడానికి రిజర్వాయర్ ఉపయోగపడనుంది.
ప్రశాంతంగా జరుగుతున్న పనులు
చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సోమవారం పనుల్లో ఆదివారానికి మించి వేగం పుంజుకున్నది. మిషనరీలు ఎక్కువగా రావడంతో పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. పెండింగ్ పనుల్లో అంతరాయంలేకుండా మూడు ఇటాచీలు, రెండు జేసీబీలు, రెండు ట్రాక్టర్ జేసీబీలు, రోడ్డురోలర్, 10 టిప్పర్లతో పనులు కొనసాగిస్తున్నాం. రెండు నెలల్లో పనులు పూర్తి చేసేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం..
గద్వాల, మార్చి 20: చిన్నోనిపల్లి నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించడంతోపాటు ఆర్ఆర్ సెంటర్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని కలెక్టర్ క్రాంతి, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి నిర్వాసితులకు భరోసానిచ్చారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, నీటిపారుదలశాఖ అధికారులతో ఆమె సోమవారం సమావేశమై నిర్వాసితుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ఆర్ సెంటర్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. గ్రామాన్ని ఖాళీ చేయడానికి నిర్వాసితులు సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాల, పంచాయతీ భవనం, అంగన్వాడీ సెంటర్, దేవాలయ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ గత పాలకుల సమన్వయలోపం వల్లే ఎప్పుడో పూర్తి కావాల్సిన రిజర్వాయర్ నేటికీ అసంపూర్తిగా ఉండిపోయిందన్నారు. చిన్నోనిపల్లి నిర్వాసితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీపీ విజయ్కుమార్, చిన్నోనిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.