కోడేరు, డిసెంబర్ 30 : విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం పెద్దలు మృతి చెందటంతో నలుగురు చిన్నారులు అనాథలుగా మిగిలారు. కోడేరు మండలం నాగులపల్లి తండాకు చెందిన స్వామి, చంద్రమ్మ దంపతులకు 17 ఏండ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరూ కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగించేవారు. వారికి పింకీ(14, 9వ తరగతి), మంజుల(12, 7వ తరగతి), ప్రణితి(10, 5వ తరగతి), సిద్ధు(02) పిల్లలు ఉన్నారు. ఏడాది కిందట క్యాన్సర్తో చంద్రమ్మ మృతి చెందింది.
తర్వాత అన్నీ తానై చిన్నారులను తండ్రి స్వామి పోషించాడు. ఈనెల 24న వ్యవసాయ కూలి పనులకు వెళ్లిన స్వామి మూర్ఛవ్యాధితో పొలంలోనే మరణించాడు. దీంతో పిల్లలు ఒంటరిగా మిగిలారు. అవ్వ, తాత ఉన్నా వారు వృద్ధులు కావడంతో వీరి పోషణ భారంగా మారింది. దీంతో తండా వాసులు చందాలు వేసుకొని స్వామి అంత్యక్రియలు జరిపించారు. అభాగ్యులుగా మిగిలిన చిన్నారులను బాలునాయక్ నిత్యావసర సరుకులు అందజేయగా.. తండావాసులు తోచిన సాయం చేస్తూ ఆదుకుంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. దాతలు ముందుకొచ్చి తల్లీతండ్రి లేని చిన్నారులకు సాయం చేసి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.