ప్రజా సేవకుడు, ప్రగతి ప్రదాత, సీఎం కేసీఆర్ పాలమూరు గడ్డపై కాలు మోపనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సోమవారం మూడు జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. దేవరకద్రలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో, గద్వాల నుంచి అయిజకు వెళ్లే రహదారి సమీపంలో, మక్తల్ ఎల్లమ్మకుంట కాటన్మిల్ వెనుక ప్రాంతంలో, నారాయణపేటలోని స్టేడియంలో నిర్వహించనున్న సభలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు పోటాపోటీగా జనసమీకరణలో నిమగ్నమయ్యారు. ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు సమావేశాలు నిర్వహించి శ్రేణుల కు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా వేదికల వద్ద పార్టీ అభ్యర్థుల భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. సభా ప్రాంగణం గులాబీమయంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా గులాబీ బాస్ పర్యటన ఉండటంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇటీవల సీనియర్ నేతలంతా పార్టీలో చేరడం.. కేసీఆర్ కీలక సభలకు హాజరుకావడం రాజకీయ వేడిని రగిలిస్తోంది.
మహబూబ్నగర్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. మూడు జిల్లాలు.. నాలుగు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, గద్వాల నియోజకవర్గాల్లోని ప్రజా ఆశీర్వాద సభలకు ప్రగతి ప్రదాత హాజరుకానున్నారు. ఆయా ప్రాంతాల్లో పార్టీశ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నిచోట్ల పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించేందుకు ఇప్పటికే పార్టీ అభ్యర్థులు సమావేశాలు నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా కేసీఆర్ బహిరంగ సభలు ఉండటంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇటీవల పార్టీలో సీనియర్ నేతలంతా చేరడం. కేసీఆర్ కీలక సభలకు హాజరుకావడం రాజకీయ వేడిని రగిలిస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు తేదీలు కూడా ఖరారయ్యాయి. ఈ టూ ర్లను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నాలుగు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటుండడంతో జిల్లా పోలీసు యం త్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే హెలిప్యాడ్ల నిర్మాణం పూర్తవగా.. సభా వేదిక, గ్యాలరీలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. సభలకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా జనం తరలివస్తుండడంతో బీఆర్ఎస్లో ఉత్సాహం నెలకొన్నది. దేవరకద్రలో ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్రెడ్డి, మక్తల్లో చిట్టెం రామ్మోహన్రెడ్డి, నారాయణపేటలో రాజేందర్రెడ్డి, గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకేరోజు ఉమ్మడి జిల్లాలోని నాలుగు సభల్లో పాల్గొనున్నారు. దేవరకద్ర, గద్వాల, నారాయణపేట, మక్తల్ జరిగే ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొనున్నారు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని కురుమూర్తికి వెళ్లే రహదారిలో బాలుర జూనియర్ కళాశాల మైదానంలో సభావేదికను ఏర్పాటు చేశారు. అనంతరం గద్వాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననుండగా, అయిజ రహదారిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. గద్వాల నుంచి మక్తల్ చేరుకుంటారు. మక్తల్ పట్టణంలోని ఎల్లమ్మకుంట కాటన్ మిల్ వెనకాల సభావేదికను సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి నేరుగా నారాయణపేటకు వెళ్తారు. నారాయణపేట పట్టణంలోని స్టేడియం మైదానంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు బయలుదేరుతారు.
ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనడానికి వస్తున్న పార్టీ అధినేతకు స్వాగతం పలకడానికి పెద్దఎత్తున ఫ్లెక్సీలు, గులాబీ జెండాలు ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చే రహదారుల వెంట నాయకుల స్వాగత తోరణాలు, జెండాలతో దేవరకద్ర, జోగుళాంబ గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలు గులాబీమయంగా మారాయి. రహదారుల చుట్టుపక్కల మొత్తం పార్టీ జెండాలను కట్టి అధినేతకు స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. సభావేదిక చుట్టుపక్కల పార్టీ అభ్యర్థులు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో సభాప్రాంగణం మొత్తం గులాబీమయమైంది.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే రాజకీయ పార్టీలు తమ అస్ర్తాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా సభల్లో ఏం మాట్లాడబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. నడిగడ్డలో సీఎం చేసే ప్రసంగంపై అందరి దృష్టిపడింది. ఇక్కడే బీజేపీ నేతలపై విరుచుకుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే నారాయణపేటలో గత ఎన్నికల్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం అధికారం వచ్చిన వెంటనే పేటను జిల్లా చేస్తామని చెప్పి ఆ కలను నెరవేర్చారు. మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేసి జిల్లా ప్రజలకు కానుకగా ఇచ్చారు. జిల్లా ఏర్పడ్డాక కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి రావడంతో జిల్లా రూపురేఖలే మారిపోవడం గమనార్హం. మళ్లీ గెలిపిస్తే జిల్లాను మరింత సస్యశ్యామలం చేసే అవకాశం లేకపోలేదు. అలాగే దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలకు మించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మొత్తంపైన పార్టీ అధినేత వస్తుండడంతో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకొనుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది.