అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో తలెత్తిన వివాదం
ఇరువర్గాల మధ్య తోపులాట
పోలీస్ పహారాలో గ్రామం
కేసులు నమోదు
కేటీదొడ్డి, మార్చి 31 : ఇరు వర్గాల మధ్య ఓ స్థల వివాదం చిలికి చిలికి గాలివనలా మారిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం ఇర్కిచేడ్లో చోటు చేసుకున్నది. ఎస్పీ రంజన్త్రన్కుమార్ కథనం మేరకు.. గురువారం ఇర్కిచేడ్లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు అంశం ఏండ్లుగా నానుతున్నది. విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థల విషయమై గ్రామ పంచాయతీ తీర్మానం చేసి నిర్ణయించినా.. చౌరస్తాలో ఏర్పాటు చేయాలని ఓ వర్గం నిర్ణయించింది. అయితే చౌరస్తాలో స్థలం తక్కువగా ఉన్నదని, అక్కడ వద్దని గ్రామస్తులు సూచించారు. దీంతో మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే ఆ స్థలం వేరే వారిది కావడంతో అక్కడ వద్దని స్థలానికి చెందిన వారు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో కొంత సేపు ఉద్రిక్తత చోటు చేసుకున్నది. అక్కడే ఉన్న ఎస్సై కుర్మయ్య పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా కర్ణాటకలో పల్లెలకు చెందిన అల్లరిమూకలను ఓ వర్గం వారు రంగంలోకి దించారు. దీంతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో బయటి వ్యక్తులు రావడంతో నిరసన హోరెత్తింది.
ఏకంగా పోలీసులే లక్ష్యంగా అల్లరి మూకలు వారిపై రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. కొద్దిసేపు రణరంగాన్ని తలపించింది. వీరిని పోలీసులు చెదరగొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో అల్లరిమూకల్లో ఒకరి చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్ ప్రమాదవశాత్తు అంబేద్కర్ విగ్రహంపై పడగా.. గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. దీంతో విగ్రహంపై ఉన్న కవర్ అంటుకున్నది. గమనించిన ఎస్సై, పోలీసులు వెంటనే మంటలను ఆర్పారు. అనంతరం ఇరువర్గాలను చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న ఎస్పీ రంజన్ రతన్కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఎన్సీహెచ్ రంగస్వామి, సీఐ ఎస్ఎం బాష గ్రామానికి చేరుకొని పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇరువర్గాలపై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులంతా ఏకతాటిపై తీర్మానం చేసుకున్నాకే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ రంగస్వామి సూచించారు. అంబేద్కర్ విగ్రహానికి ఏమీ కాలేదని చెప్పారు.