భూత్పూర్, డిసెంబర్ 17 : నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీయువకుల కోసం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చేస్తున్న కృషి ఎనలేనిదని పీజేఆర్ కోచింగ్ సెంటర్ చైర్మన్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఆల తండ్రి రఘుపతిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2016 నుంచి నిరుద్యోగులకు కోచింగ్ ఇప్పిస్తున్నారన్నారు. హైదరాబాద్లోని ప్రముఖ కోచింగ్ సెంటర్ నుంచి అనువజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఉచితంగా కోచింగ్, స్టడీ మెటీరియల్, వసతి కల్పించడం చాలా గొప్ప విషయమన్నారు.
2016లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే యువతీయువకులకు అవగాహన కల్పించి దేవరకద్ర మార్కెట్ యార్డ్లో 600 మందికి శిక్షణ తరగతులను ప్రారంభించారన్నారు. ఇందులో 102 మంది కానిస్టేబుల్, 26 మంది ఎస్సై పోస్టులకు ఎంపికయ్యారని చెప్పారు. 2018లో కొత్తకోట రాఘవేంద్రస్వామి ఆలయంలో 500 మందికి శిక్షణ ఇప్పిస్తే.. 172 మంది కానిస్టేబుల్, 8 మంది ఎస్సై ఉద్యోగాలను సాధించినట్లు తెలిపారు. 2020లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటీఫికేషన్ విడుదల చేయగా.. దేవరకద్రలో 700 మందికి శిక్షణ ఇవ్వగా.. 400 మంది టెట్ క్వాలిఫై అయ్యారన్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు భారీ ఎత్తున విడుదల చేసిందన్నారు.
శిక్షణా తరగతులను నిర్వహించేందుకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈసారి గ్రూప్ 1, 2, 3, 4 కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు అన్నాసాగర్లో దరఖాస్తు ఫారాలను తీసుకొని.., వివరాలను నింపిన తరువాత అందజేయాలన్నారు. జనవరి 6 నుంచి శిక్షణా తరగతులను ప్రారంభిస్తామని, అభ్యర్థుల సంఖ్యను బట్టి శిక్షణ ఇచ్చే స్థలాన్ని తెలియజేస్తామన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు వివరాలకు 93476 31272, 6305550396, 7093128808 సంప్రదించాలన్నారు. సమావేశంలో ఎంపీపీ శేఖర్రెడ్డి, వైస్ ఎంపీపీ నరేశ్గౌడ్, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.