వనపర్తి, డిసెంబర్ 12: వనపర్తి అంటేనే విద్యాలయానికి చిరునామా. అలాంటి విద్యాపర్తిలో ఎంతోమంది విద్యనభ్యసించి ఉన్నత స్థానాలను అధిరోహించి విదేశాల్లో సైతం స్థిరపడిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి ఉన్నతస్థానాల్లో ఎదిగిన వారు సైతం తమ తమ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తున్నారు. వనపర్తి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రామ్మోహన్రెడ్డి పట్టణంలో ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసించి విదేశాలల్లో స్థిరపడ్డారు. కరోనా వంటి విపత్కర సమయంలో కరోనా బాధితులకు మెరుగైన సేవలను అందించాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం సేవలకుగాను తనవంతుగా జిల్లా దవాఖానకు లక్షల రూపాయలు వెచ్చించి జూలై 10, 2021న 10 ఐసీయూ బెడ్లను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా, వైద్యులతో కలిసి అందజేశారు. అక్కడే నిఘా నేత్రాల ఏర్పాటుకు నాంది పలికింది. దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలను అధునాతన టెక్నాలజీ గల కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని హైదరాబాద్ కంపెనీ వారితో మాట్లాడి పట్టణం మొత్తం అన్ని రహదారుల్లో ప్రస్తుతం సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
సీసీ కెమెరాల పనితీరు
అడ్వాన్స్డ్ కెమెరాలు వాహనం అర కిలోమీటరు ఉండగానే గుర్తించడం, వాహనం నెంబర్ను ఆటోమెటిక్గా సేవ్ చేసుకోవడం, వాహనం ఎటు నుంచి పట్టణానికి ఏ రహదారి నుంచి వచ్చిందో బయటకు ఎక్కడి నుంచి వెళ్లింది అన్న విషయాన్ని కేవలం వాహనం నెంబర్ సెర్చ్ చేస్తే తెలిసేలా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
పట్టణంలోనికి వచ్చే ప్రతి వాహనం యొక్క నెంబర్ ప్లేట్ను రికార్డు చేసుకొని కంట్రోల్ రూమ్లో కనిపిస్తుంది.
రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు అరికట్టవచ్చు. అదేవిధంగా మహిళలు, పిల్లలను వేధించే ఆకతాయిలను సులభంగా పట్టుకోవడానికి నిఘా నేత్రాలు పనిచేస్తాయి.
నా వంతు కృషి చేశాను
మాది వనపర్తి మండలం వెంకటాపురం గ్రామం. చిన్నప్పటి నుంచి వనపర్తిలో ఉండి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్యనభ్యసించి విదేశాల్లో స్థిరపడ్డాను. పట్టణానికి తనవంతుగా ఏదైనా చేయాలన్నదే నా లక్ష్యం. నా లక్ష్యానికి రాంచంద్రారెడ్డి తోడు కావడంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా కరోనా వంటి విపత్కర సమయంలో తమవంతుగా జిల్లా దవాఖానలో 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. నేను సైతం చేపట్టిన పలు కార్యక్రమాలపై డీఎస్పీ కిరణ్కుమార్, పట్టణ ఎస్సై మధుసూదన్కు వివరించాను. తక్షణమే అధునాతన టెక్నాలజీ సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.10లక్షలు సంబంధిత కంపెనీ వారికి చెల్లించడం జరిగింది. పట్టణ ప్రజల సంక్షేమమే మా ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం.
సహకారం మరువలేనిది..
నేను సైతం కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, విదేశాలల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు అందింస్తున్న సేవలు ఎనలేనివి. వారందరి సమిష్టి కృషి తోనే ఆరు నెలల్లో 65 కెమెరాలను ఏర్పాటు చేయించారు. నేను సైతానికి సహకారాన్ని అందించిన వారందరిని స్పూర్తిగా తీసుకున్నట్లయితే పట్టణాన్ని ఆదర్శవంతమైన పట్టణంగా , సురక్షిత పట్టణంగా మార్చడానికి వీలుగా ఉంటుంది.