గద్వాల జెడ్పీసెంటర్, డిసెంబర్ 14 : సామాన్యులకు సైతం ఉచిత వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ను తలదన్నేలా వైద్య సేవలందిస్తున్నది. ఈ క్రమంలో గ్రామీణ ఆరో గ్య అధ్యయన సంస్థ (ఐఆర్హెచ్ఎస్) ద్వారా గద్వాల జిల్లా దవాఖానలో క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మహిళలు ఎదుర్కొంటున్న అతి భయంకరమైన గర్భాశ య క్యాన్సర్ను దృష్టిలో ఉంచుకొని ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సర్వికల్, ఓరల్, బ్రెస్ట్, రొమ్ము, గొంతు క్యాన్సర్ వంటి రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అత్యాధునిక పరికరాలతో అనుభవజ్ఞులైన వైద్య సిబ్బందిని నియమించి సత్వర సేవలను ప్రారంభించింది. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య సేవలు పొందొచ్చు. 25 నుంచి 60 ఏండ్ల వయస్సు ఉన్న మహిళలు గర్భాశయ ముఖ ద్వార పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడి దవాఖానల్లో నిర్వహించిన పరీక్షల్లో లక్షణాలు కనిపిస్తే బయాప్సీని సేకరించి హైదరాబాద్లోని అపోలో దవాఖానకు పంపిస్తారు. పాజిటివ్గా నిర్ధారణ అయితే బాధితులను ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానకు రెఫర్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. బాధితులకు రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది.
మహిళల కడుపులో పుండ్లు, మచ్చలు, తెల్లబట్ట, క్యాన్సర్ మచ్చలు, లోయర్ అబ్డామినల్ నొప్పి తదితర లక్షణాలుంటే నిరభ్యంతరంగా పరీక్షలు చేయించుకోవాలి. ఆశవర్కర్లు లేదా ఆరోగ్య కార్యకర్తలను సంప్రదిస్తే వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. 25 ఏండ్లు నిండిన ప్రతీ మహిళ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తవు. క్యాన్సర్ నిర్ధారణ కేంద్రంలో కాల్పోస్కోపీ పరికరం ద్వారా పరీక్షలు చేసి పదేండ్ల తర్వాత వచ్చే వ్యాధిని గుర్తించే అవకాశం ఉంటుంది. కొంత మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ సోకడం ద్వారా గర్భసంచులు తొలగించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే, ప్రస్తుతం గర్భసంచులు తొలగించకుండానే వ్యాధి ఏ స్టేజీలో ఉందో గుర్తించి చికిత్స అందిస్తున్నారు. వ్యాధి చివరి దశలో ఉంటే రోగులకు హెల్పర్ అవసరం ఉంటుంది. సహాయకులు అందుబాటులో లేకుంటే దవాఖానలోని పాలియేటివ్ కేర్లో చేరితే ఆరోగ్య సిబ్బంది అన్ని రకాల వైద్య సేవలందిస్తారు. డీఎంహెచ్వో చందూనాయక్, పీవో మారుతినందన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్లో 50 మందికి పరీక్షలు చేయగా.. ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. సెప్టెంబర్లో 110 పరీక్షలకుగానూ ఐదుగురికి, అక్టోబర్లో 77కు నాలుగు, నవంబర్లో 154 మందికి పరీక్షలు చేయగా, ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు సిబ్బంది నిర్మల, సమీన తెలిపారు.