మహబూబ్నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మూసాపేట; ఏప్రిల్ 23 : “దేశంలోని 19 రాష్ర్టాలతోపాటు కేంద్రంలో నూ బీజేపీ ప్రభుత్వమే ఉన్నది.. మరి సీఎం కేసీఆర్ ఇచ్చినట్లు ఆ రాష్ర్టాల్లో రైతుబంధు ఎందుకు ఇస్తలేరు? రెండు వేల పింఛన్ ఎందుకిస్తలేరు? మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, దళితబంధు ఎందుకిస్తలేరు? ఆడ ఇయ్యలేనోడు ఇక్కడ ఇస్తాడా? ప్రజలు ఒకసారి అలోచించాలి” అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ముసాపేట సమీపంలోని ఓ విత్తన కంపెనీలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. సమావేశానికి వే లాది కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉండి.. ఆయా రాష్ర్టాల్లో సంక్షేమాన్ని ఇవ్వనోళ్లు.. ఇక్కడకు జెండాలు పట్టుకొని వస్తే మద్దతెలా తెలుపుతామని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సహకారంలో రెండుసార్లు ఈ నియెజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచానని.. 70 ఏండ్లలో చేయని అభివృద్ధిని.. తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్లలోనే చేసి చూపిందన్నారు.
ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం ఆసరాగా నిలిచిందన్నారు. రైతుబంధు పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. 70 ఏండ్లు ఎంతోమంది పాలింనా.. వాళ్ల జేబులు నింపుకున్నారే తప్ప పేదల కడుపు నింపుదామని ఏనాడు ఆలోచించలేదని విమర్శించారు. ఎన్నికలొస్తే చాలు.. గ్రామాల్లోకి పనిచేయనోళ్లే వచ్చి ఎక్కువగా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఇంత గొప్ప ప్రభుత్వం, ఇంత విజన్ ఉన్న సీఎం మళ్లీ మనకు దొరకడన్నారు. కర్వేన ప్రాజెక్టు పూర్తయితే ఈప్రాం తం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తికాకుండా కొందరు కోర్టులో కేసులు వేశారన్నారు. కర్ణాటక, ఆంధ్రాలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చినోళ్లు మన పాలమూరు-రంగారెడ్డికి ఎందుకివ్వలేదో ఆలోచించాలన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే మోదీ ఇంటిఎదుట ధర్నా చేసి జాతీయ హోదా సాధించాలన్నారు. బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా జిల్లాలో జెండాలు పట్టుకొని తిరుగుతున్నారని విమర్శించారు.
ప్రతిపక్షాలకు పనిలేదు : లక్ష్మారెడ్డి
తెలంగాణ వచ్చాక ప్రతిపక్షాలకు పనిలేకుండా పోయిందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. వేసవి వస్తే చాలు కరెంట్ కోసం సబ్స్టేష్టన్ల ఎదుట ధర్నాలు చేసేవాళ్లు. మోటర్లు కాలిపోతే రైతుల ధర్నాలు, గుక్కెడు నీళ్ల కోసం బిందెలతో రాస్తారోకో ఇలా ఎన్నో సమస్యలతో నిరసన చేపట్టేటోళ్లని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వాళ్లకు పనిలేకుండా పోయిందన్నారు. అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చాక ప్రతి పల్లెలో పండుగ వాతావరణం కనిపిస్తున్నదని.. ఇందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కారణమన్నారు. జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ దేవరకద్ర నియెజకవర్గంలో రూ.170కోట్లు వెచ్చించి ఎమ్మెల్యే ఆల 21 చెక్డ్యాంలు కట్టించాడని.. ఎప్పు డూ నియోజకవర్గ అభివృద్ధి గు రించి ఆలోచించే ఎమ్మెల్యే దొరకడం అదృష్టమన్నారు.
దేవరకద్ర నియెజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ‘ఆల’కు అందరూ అండగా ఉండాలన్నారు. రాబోయే ఎన్నికల్లో రెట్టింపు మెజార్టీతో గెలిపిస్తే ఎమ్మెల్యే మరింత ఉత్సాహంతో పనిచేస్తారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలతో గ్రామాల్లో సమస్యలు లేవన్నారు. ప్రజాప్రతినిధులకు కూడా గౌవరం కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలన్నారు. సమ్మేళనంలో గిడ్డంగులసంస్థ చైర్మన్ సాయిచంద్ ఆటపాటలతో హోరెత్తించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి ఆల మంజుల, ముసాపేట జెడ్పీటీసీ ఇంద్రసాగర్, అడ్డాకుల జెడ్పీటీసీ రాజేశేఖర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
25న జెండాపండుగ
జడ్చర్ల, ఏప్రిల్ 23: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. 25న జడ్చర్ల నియోజకవర్గ ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సమావేశానికి నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, సిండిల్విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, రైతుబంధు కోఆర్డినేటర్లు, వార్డులు, పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా అధ్యక్ష్య, కార్యదర్శులు హాజరుకావాలని కోరారు. 25న ఉదయం 9 గంటలలోగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం జడ్చర్లలో నిర్వహించే నియోజకవర్గస్థాయి ప్రతినిధుల సమావేశానికి రావాలని పిలుపునిచ్చారు.