దామరగిద్ద, అక్టోబర్ 5 : ప్రతిఒక్కరూ ఆర్థికంగా ఎదగడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని నారాయణపేట ఎమ్యెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని లోకుర్తి, మల్రెడ్డిపల్లి, మొగల్మడ్క గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ ఆర్థికంగా ఎదగడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. లోకుర్తిలో జెండావిష్కరణ అనంతరం 133/11 కేవీ సబ్స్టేషన్ను ప్రారంభించి మాట్లాడుతూ రైతులను రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్, కావాల్సినన్ని ఎరువులు, పంట పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి అవస్థలు పడకుండా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొని వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. ఒకప్పుడు గ్రామాలు అంధకారంలో ఉండేవని, నేడు ప్రతిగ్రామంలో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. కులవృత్తులకు సాయం అందించి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
దళితబంధు ద్వారా ఆర్థికసాయం అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అనంతరం మల్రెడ్డిపల్లి చెరువులో చేప పిల్లలను వదిలారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడంతోపాటు ఆట వస్తువులతో కిట్లు కూడా అందిస్తున్నట్లు వివరించారు. అనంతరం సజనాపూర్ గ్రామానికి చెందిన కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ భీమయ్యగౌడ్, ఎంపీపీ బక్క నర్సప్ప, వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి, పీఏసీసీఎస్ అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, రైతుబంధు సమితి జిల్లా నాయకుడు వెంకట్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.