వనపర్తి టౌన్, ఏప్రిల్ 20 : ఆర్టీసీ రక్షణ, సమస్యల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఈనెల 22వ తేదీ నుంచి చేపడుతున్న ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దుతు ఇస్తుందని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు వాకిటీ శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను మరిచిపోయి పాలన చేస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచిపోయిన ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, 2021 వేతన సవరణ 30శాతం ఫిట్మెంట్ను అమలు చేయాలని, 2025 సవరణ అమలు చేయాలని, మహాలక్ష్మీ పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ప్రతి నెలా రూ.400కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలని, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బెడ్ విన్నర్
పోస్టులను పర్మినెంట్ ఉద్యోగుల కింద భర్తీ చేయాలని, ట్రెడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని, కండక్టర్, డ్రైవర్లపై కేఎంపీఎల్, ఈపీకే వేధింపులు మానుకోవాలని, ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలని, అద్దె బస్సులను, అద్దె డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేసుకోవాలని, గ్రేటర్ హైదరాబాద్ జోన్లో పనిచేస్తున్న సిబ్బందికి కరీంనగర్ జోన్, హైదరాబాద్ జోన్లకు బలవంతంగా బదిలీ చేసి ఉత్తర్వులను రద్దు చేయాలని, 2019 సమ్మె కాలంలో నమోదైన పోలీస్ కేసులను ఎత్తివేయాలని, మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, రదీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని, అన్ని కేటగిరీల్లోని ఖాళీలను భర్తీ చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను అన్నింటిని చెల్లించడంతో పాటు దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.