కారు టాప్గేర్లో దూసుకెళ్తున్నది. స్పీడును అందుకోలేక ప్రతి పక్షాలు డీలా పడ్డాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ దూకుడు కొనసాగుతున్నది. మరోసారి అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్స్వీప్ చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ఏడు సెగ్మెంట్లలోని అభ్యర్థులు ముచ్చటగా మూడోసారి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. 2014, 2018లో వరుసగా విజయం సాధించిన పాలమూరు, దేవరకద్ర, జడ్చర్ల, కందనూలు,నారాయణ పేట, మక్తల్, అచ్చంపేటలో ఈసారి గెలుపు నల్లేరుమీద నడకే అన్న సమీకరణలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నది. అయితే ఇక్కడి రేస్గుర్రాల హ్యాట్రిక్ను ఎలాగైనా ఆపాలని ప్రతిపక్షాలు ఎత్తులు వేస్తున్నా.. గులాబీ పార్టీ వ్యూహరచనతో ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నది. దీంతో కాంగ్రెస్, బీజేపీకి పరీక్షగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్ బరిలో ఉన్న ఈ స్థానాల్లో అసమ్మతి భగ్గుమంటున్నది. టికెట్లు రాకపోవడంతో తీవ్ర అసహనంతో పలువురు బీఆర్ఎస్ గూటికి చేరారు. ప్రచారంలో కారు దూసుకెళ్తుండడంతో వార్వన్సైడే అన్నట్లు సమీకరణలు మారాయి.
మహబూబ్నగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏడు నియెజకవర్గాల గెలుపోటములపై ఉత్కంఠ నెలకొన్నది. 2014, 2018 ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి వి.శ్రీనివాస్గౌడ్, జడ్చర్ల నుంచి లక్ష్మారెడ్డి, దేవరకద్ర నుంచి ఆల వెంకటేశ్వర్రెడ్డి, అచ్చంపేట నుంచి గువ్వల బాలరాజు, నాగర్కర్నూల్ నుంచి మర్రి జనార్దన్రెడ్డి, మక్తల్ నుంచి చిట్టెం రామ్మోహన్రెడ్డి, నారాయణపేట నుంచి ఎస్.రాజేందర్రెడ్డి వరుసగా రెండుసార్లు గెలుపుబావుటా ఎగురవేశారు. ముచ్చటగా మూడోసారి గెలుపొందేందుకు ఉవ్విలళ్లూరుతున్నారు. హ్యాట్రిక్ విజయాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు ఎత్తుగడలు వేస్తుంటే బీఆర్ఎస్ అభ్యర్థులు వాటిని చిత్తుచేస్తున్నారు. మొత్తం 12 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు నడుస్తుండగా, ఏడు నియోజకవర్గాల్లో కారుస్పీడుకు బ్రేకులు వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీకి నిలబెట్టిన చోట ఐదు సెగ్మెంట్లలో తీవ్ర అసమ్మతి నెలకొంది. టికెట్లు ఆశించి భంగపడ్డ వారంతా కారెక్కడంతో రాజకీయ పరిణామాలు మలుపు తిరిగాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల మధ్య చీలికలు కలిసొచ్చే అంశంగా భావిస్తూ దూసుకుపోతున్నారు. ఈసారి ఔర్ ఏక్ దక్కా.. హ్యాట్రిక్ పక్కా అంటూ ముందుకు దూసుకుపోతున్నారు. తెలంగాణ అవిర్భావం తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 2014లో ఆరు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. తొలి తెలంగాణ రాష్ర్టానికి పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు.
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మంత్రి వర్గంలో కూడా స్థానం లభించింది. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, టీడీపీ నుంచి గెలుపొందిన నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కారెక్కారు. దీంతో బీఆర్ఎస్ బలం ఎనిమిదికి చేరుకున్నది. 2018 ఎన్నికల్లో కారు ప్రభంజనం సృష్టించడంతో ఏకంగా ఉమ్మడి జిల్లాలో 13 నియెజకవర్గాలు గెలిచి టాప్గేర్లో దూసుకుపోయింది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో కొల్లాపూర్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కారెక్కడంతో ఉమ్మడి జిల్లాలో క్లీన్స్వీప్ చేసినట్లయ్యింది. 2014, 2018 ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి వి.శ్రీనివాస్గౌడ్, జడ్చర్ల నుంచి లక్ష్మారెడ్డి, దేవరకద్ర నుంచి ఆలవెంకటేశ్వర్రెడ్డి, అచ్చంపేట నుంచి గువ్వల బాలరాజు, నాగర్కర్నూల్ నుంచి మర్రి జనార్దన్రెడ్డి, మక్తల్ నుంచి చిట్టెం రామ్మోహన్రెడ్డి, నారాయణపేట నుంచి ఎస్.రాజేందర్రెడ్డి వరుసగా రెండు సార్లు గెలుపుబావుటా ఎగురరేశారు. ఈసారి కూడా బీఆర్ఎస్ తరఫున మళ్లీ పోటీకి దిగుతుండడంతో ఈ సెగ్మెంట్లలో ఎన్నికలు ప్రతిష్టాత్మంగా మారాయి. ఈసారి గెలిస్తే వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకుంటారు. అందరి దృష్టి ఈ నియోజకవర్గాలపై పడింది. ఈ సెగ్మెంట్లలో కాంగ్రెస్తో బీఆర్ఎస్కు ముఖాముఖి పోరు ఉండబోతుంది. బీజేపీ నామమాత్రపు పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. ప్రచారంలో దూసుకుపోతున్న గులాబీదళం మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో ప్రచారంలో దూసుకుపోతున్నది. అన్ని జిల్లాల్లో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. భారీఎత్తున ర్యాలీలు చేపట్టి తడాఖా చూపించారు. కాగా మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, అచ్చంపేట, నాగర్కర్నూల్ నియెజకవర్గాల్లో పోటీకి దిగిన అభ్యర్థులకు హ్యాట్రిక్ చాన్స్ ఉంది. ముచ్చటగా మూడోసారి గెలుపొంది ఈసారి హ్యాట్రిక్ సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఏడు సెగ్మెంట్లలో ఐదు చోట్ల కాంగ్రెస్తో ముఖాముఖి పోటీ ఉండగా, రెండుచోట్ల త్రిముఖ పోటీ నెలకొన్నది.
మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ హ్యాట్రిక్ విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు గడపగడపకు ప్రచారం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన మెజార్టీకి మించి గెలిపించాలని శ్రమిస్తున్నారు. జడ్చర్లలో లక్ష్మారెడ్డి ఉదయం ఏడు గంటల నుంచే ప్రచారంలో ఉంటున్నారు. నియెజకవర్గంలోని చేరికలపై దృష్టి పెడుతున్నారు. దేవరకద్రలో ఆల వెంకటేశ్వర్రెడ్డి తనదైన శైలిలో ప్రచారం చేపడుతున్నారు. మక్తల్లో చిట్టెం రామ్మోహన్రెడ్డి ఉదయమే గ్రామాలకు వెళ్తున్నారు. కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. నారాయణపేటలో రాజేందర్రెడ్డి గ్రామాగ్రామాన బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను తీసుకెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తనదైన ైస్టెల్లో దూసుకుపోతున్నారు. కార్యకర్తలతో మమేకమై ఆకట్టుకుంటున్నారు. అచ్చంపేటలో గువ్వల బాలరాజు గ్రామగ్రామానికి వెళ్లి ప్రజలే తన కుటుంబమని ప్రచారంలో దూసుకుపోతున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు హ్యాట్రిక్ సాధించే స్థానాలపై అందరి దృష్టిపడింది. అందరికంటే ముందుగానే పార్టీ అధినేత టికెట్లు కేటాయించి బీఫారాలు అందించడంతో ప్రచార పర్వంలో బీజీ అయిపోయారు. ఈ ఏడు స్థానాల్లో ఎలాగైనా గెలవాలని గులాబీదళం వ్యూహరచనలు చేస్తున్నారు. మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, అచ్చంపేట, నాగర్కర్నూల్ జిల్లాలో ముఖాముఖి పోరు ఉండబోతున్నది. ఈ ఐదు స్థానాల్లో కాంగ్రెస్తో నే ప్రాధాన పోటీ ఉండనున్నది. మక్తల్, నారాయణపేటలో మా త్రం కాంగ్రెస్, బీజేపీతో త్రిముఖ పోటీ నెలకొన్నది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థు ల్లో చాలామంది టికెట్లు కొన్నారనే ప్రచారం జ రుగుతున్నది. మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నాగర్కర్నూల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమై చాలా మంది సీనియర్లు, టికెట్ ఆశించి భంగపడ్డవారు కారెక్కేశారు. నాగర్కర్నూల్లో మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి కాంగ్రెస్ను వీడడంతో ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని పరిశీలకులు అంటున్నారు. జడ్చర్ల, మహబూబ్నగర్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, ఎర్రశేఖర్ గులాబీ గూటికి చేరడంతో ఈ నియెజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. మక్తల్, నారాయణపేటల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన కూడా తీవ్ర అసంతృప్తికి ఆజ్యం పోసింది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన ప్రశాంత్కుమార్రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. బీజేపీలో ఎన్నోఏండ్లుగా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేరుపడిన కొండయ్యను కాదని జలందర్రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ద్వితీయ శ్రేణి నాయకులంతా కారెక్కుతున్నారు. నారాయణపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ను బీసీలకు కాకుండా ఇతర సామాజిక వర్గాలకు ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. బీజేపీ టికెట్ను ఆశించిన యువనేత సత్యయాదవ్ను కాదని ఓడిపోయే క్యాండెట్కు ఇవ్వడంతో ఆయన భగ్గుమంటున్నారు.
ఉమ్మడి జిల్లా లోని 12 స్థానాల్లో ఏడింట్లో హ్యాట్రిక్ ఛాన్స్ ఉండడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ సానాల్లో ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్ భారీ స్కెచ్ వేసింది. హ్యాట్రిక్ విజయాన్ని ఆపేందుకు కాంగ్రెస్ వేసిన ఎత్తుగడలు చిత్తయ్యాయి. ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లడంతో ఆ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. బీజేపీలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతున్నది. మరోవైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కర్ణాటక రాష్ట్రం కూడా సరిహద్దు కావడంతో అక్కడ సర్కార్ వైఫల్యాలు కండ్లకు కట్టినట్లు తెలుస్తున్నాయి. కరెంట్ ఇవ్వకపోవడం, తాగునీటి ఎద్దడి, రైతులకు ఎలాంటి సహాయం చేయకపోవడం, గ్యారెంటీలను ఇవ్వలేక చేతులెత్తేయడం వంటివి బీఆర్ఎస్కు కలిసి వస్తున్న అంశాలు. సాగునీరు, 24 గంటల కరెంట్, రైతుబందు, రైతుబీమా అంశాలు బీఆర్ఎస్కు అనుకూలంగా మారాయి. అంతేకాక చిన్న జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి ప్రజల చెంతకు చేరింది. దీంతో అన్ని బలాలతో బీఆర్ఎస్ ఈసారి ఎన్నికల్లో కూడా గెలిచి తీరాలని భావిస్తున్నది. ఇప్పటికే పార్టీ అధినేత హ్యాట్రిక్ విజయం సాధించే నియోజకవర్గాల్లో పర్యటించారు. ఒక్క మహబూబ్నగర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈసారి హ్యాట్రిక్ సాధించి కేసీఆర్ హ్యాట్రిక్ సర్కారులో పాలుపంచుకుంటారా లేదా అనేది డిసెంబర్లో తేలనున్నది.