తెలంగాణ చందురుడు.. అభివృద్ధి ప్రదాత.. అపర భగీరథుడు.. రైతు బాంధవుడు.. గులాబీ బాస్ కేసీఆర్.. ఈ మూడక్షరాల పదం ఉమ్మడి పాలమూరు జిల్లా వాసుల్లో చెరగని ముద్ర వేసుకున్నది. గతంలో ఎంపీగా ఉంటూ దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఆకాంక్షను తీర్చిన ఉద్యమ యోధుడు.. గత పదేండ్లలో తెలంగాణతో పాటు కరువు, గంజి కేంద్రాలకు నిలయమై అన్నం కోసం అల్లాడిన పల్లెల ముఖ చిత్రాన్ని మార్చిన మహానేత.. అంతటి మహోన్నతుడి జన్మదినోత్సవ వేడుకలకు వేళైంది. శనివారం ఉత్సాహంగా నిర్వహించేందుకు పల్లెలు, పట్నాలు సిద్ధమయ్యాయి. కాలం మారినా, పాలన మారినా.. కేసీఆర్ పేరు పాలమూరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నది.
చెంతనే కృష్ణమ్మ పారుతున్నా కొల్లాపూర్లో గుక్కెడు తాగునీటి కోసం గోసపడిన పరిస్థితులు సమైక్య పాలనలో జరిగాయి. అలాంటి కృష్ణమ్మను సమైక్య పాలకులు పెండింగ్లో ఉంచుతూ వచ్చిన కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం అయ్యాక కేసీఆర్ పూర్తి చేయించారు. దీనివల్ల నాగర్కర్నూల్ జిల్లా, వనపర్తి, జడ్చర్లలాంటి ప్రాంతాల్లో దాదాపుగా 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. ఇక దక్షిణ తెలంగాణ వరప్రదాయిని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2015, జూన్ 11న భూత్పూర్ మండలం కరివెన వద్ద శంకుస్థాపన చేశారు. ఈ పథకంలో తొలి రిజర్వాయర్ నార్లాపూర్ను సీఎం స్వయంగా గతేడాది అక్టోబర్లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏదుల, వట్టెం రిజర్వాయర్లను సైతం దాదాపు పూర్తి చేయించారు. కరివెన, ఉదండా
పూర్ పనులు జరుగుతున్నాయి.
ఇక భీమా, జూరాల, కోయిల్సాగర్, నెట్టెంపాడు పెండింగ్ పనులను పూర్తి చేయించారు. ఇలా అసాధ్యమనుకున్న కృష్ణా నీటిని ఎత్తిపోయించడంతో పాటుగా ఉమ్మడి పాలమూరులోని చెరువులను మిషన్ కాకతీయ పథకంతో పునరుద్ధరించారు. దీంతో కరువు దాదాపు దూరమైంది. నాడు వట్టిపోయిన బావులు, చెరువులు, బోర్లలో నీళ్లు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పల్లెల్లో ఉన్న గంజి కేంద్రాలు ఇప్పుడు మాయమయ్యాయి. ఉన్న ఊళ్లోనే రైతులు సొంతంగా పని చేసుకుంటూ కుటుంబంతో జీవిస్తున్నారు.
మహబూబ్నగర్, నారాయణపేట నుంచి ముంబైకి వలస వెళ్లే కూలీలు లేకుండా పోయారు. పాలమూరుకే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్లాంటి ప్రాంతాల నుంచి వలస వచ్చే పరిస్థితులు మారాయి. ఇక అభివృద్ధిలో నూతన చరిత్ర గత పదేండ్లల్లో జరగడం విశేషం. ముఖ్యంగా నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల కొత్తగా జిల్లాలుగా ఆవిర్భవించాయి. ఈ జిల్లాల్లో ఐదు మెడికల్ కళాశాలలు, వనపర్తి, మహబూబ్నగర్కు ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరయ్యాయి.
అలాగే అగ్రికల్చర్, పాలిటెక్నిక్, పీజీ, హార్టికల్చర్ కళాశాలలు, గురుకులాల ఏర్పాటుతో విద్యా, వైద్య రంగాల్లో వినూత్న మార్పు వచ్చింది. మహబూబ్నగర్లో ఐటీ పార్కు, కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు, సూపర్ స్పెషాలిటీ దవాఖాన, సోమశిల, మన్ననూర్ ఎకో టూరిజం, జిల్లాలను అనుసంధానిస్తూ నిర్మించిన డబుల్ రోడ్లు, మినీ ట్యాంక్బండ్లు నిర్మాణాత్మకమయ్యాయి. జిల్లా కేంద్రాలైన మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తిలో అభివృద్ధి ఊహించని స్థాయిలో జరిగింది. టీఎస్పీఎస్సీ, టీఆర్టీ ద్వారా, మెడికల్, పోలీసు రిక్రూట్మెంట్, ఇతర శాఖల పరిధిలో వేలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించారు. ముఖ్యంగా పాలమూ రు ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో కేసీఆర్కు పాలమూరుపై ప్రేమ మక్కువ. ఇది పాలమూరు ప్రజలకు దక్కిన అదృష్టం. పదేండ్లపాటు ప్రజలకు ఇచ్చిన నీళ్లు, నిధు లు, నియామకాల లక్ష్యాన్ని సాకారం చేసిన కేసీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి పాలమూరులో ఘనంగా జరుపుకోనున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మారినా ప్రజల కోసం ఉద్యమ పటిమతో ముందుకు సాగుతున్న కేసీఆర్ ఇక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నారనేది సత్యం.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ యోధుడు, సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలను శనివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఊరూరా ఘనంగా జరుపు కోనున్నారు. బీఆర్ఎస్ నాయకులతో పాటుగా ఉద్యమకారులు వేడుకల నిర్వహణకు సన్నద్ధమయ్యారు. కేసీఆర్ పేరు పాలమూరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఉద్యమ కాలంలో రాజోళి బండను బద్ధలు కొడతామంటూ సీమ నేతలు చేసిన ప్రకటనతో స్వయంగా పాదయాత్ర చేసి, సీమనేతలకు తెలంగాణ యాసలో ధీటైన, ఘాటైన బదులిచ్చి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు ఆయన. ఆ తర్వాత చేసిన పాదయాత్రతో పాలమూరులో ఉద్యమం పతాక స్థాయికి చేరింది. కేసీఆర్ వెంట నడిచిన నాటి చిన్న నేతలు ఆ తర్వాతి కాలంలో రాష్ట్ర నేతలుగా, ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా ఎదిగారు. ఇక పాదయాత్ర సందర్భంగా గిరిజనులకు స్వయం పరిపాలన చేస్తామంటూ ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే తండాలను పంచాయతీలుగా మార్చడం విశేషం.
రాజకీయాల్లో అరుదైన వ్యక్తుల్లో కేసీఆర్ ఒకరని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని రావుల పంచుకొన్నారు. టీడీపీలో 1982 నుంచి కేసీఆర్తో కలిసి నేను పనిచేశాను. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను హౌసింగ్బోర్డు చైర్మన్గా, ఆయన రవాణాశాఖ మంత్రిగా ఉండగా చీప్ విప్గాపనిచేశాను. రెండు ఉప ఎన్నికల్లో కలిసి పనిచేశాం. రాజకీయాల్లో అరుదైన వ్య క్తుల్లో ఆయన ఒకరు. ఆయన సునిశిత పరిశీలన, విషయ పరిజ్ఞా నం, ఏ సబ్జెక్టు అయినా విశ్లేషించే తీరు ప్రత్యేకంగా ఉంటాయి. లోతైన అవగాహనతో ఉంటారు. టీడీపీలో ఆయన జన్మభూమి, శ్ర మదానం కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లో అద్భుతంగా పనిచేశారు. తనకున్న నాలెడ్జ్ను నలుగురికి పంచడం, తన విజ్ఞానాన్ని మెరుగుపర్చుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తారు. ఆ యన ఎంపీగా మహబూబ్నగర్లో పోటీచేసినప్పుడు నేను టీడీపీ నుంచి వనపర్తి ఎమ్మెల్యేగా పోటీచేశాను. ఏదైనా పనిపై దృష్టిసారించారంటే దాన్ని పూర్తిచేసే వరకు విశ్రమించరు. అందుకే జీవితంలో అనేక విజయాలు సాధించారు. అసాధ్యం అనుకున్నవాటిని కూడా సుసాధ్యం చేయగలిగారు.