శ్రీశైలం, ఫిబ్రవరి 21 : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలం వేదమంత్రోచ్ఛారణల మధ్య మంగళవాయిద్యాలతో అక్కమహాదేవి మండపంలో శాస్ర్తోక్త పూజలు జరిపించి ఆలయోత్సవం నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. దివ్యకాంతులను ప్రసరింపజేస్తూ భక్తులకు వరాలిచ్చే స్వామి, అమ్మవార్ల అశ్వ వాహనసేవను వీక్షించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు.
అమ్మవారికి ప్రీతికరమైన కాగడాలు, ఎర్రగులాబీలు, తెల్లచామంతి, ఊదాచామంతి, మందారం, లిల్లీ, ఎర్రగన్నేరు, ఊదగన్నేరు, దేవగన్నేరు, నందివర్ధనం, గరుడవర్ధనం, తెల్లచామంతి వంటి 35 రకాల ప్రత్యేక పూష్పాలను సమర్పించడంతోపాటు 9 రకాల పండ్లతోపాటు బిల్వం మరువం మాచీపత్రితో ప్రత్యేక అలంకరణ చేశారు. శయనమందిరంలో భ్రామరి, మల్లన్న ఏకాంతసేవగా శయనోత్సవాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన కళాకారులతోపాటు ఆలయ అధికారులను సిబ్బందిని అభినందించారు.