గద్వాల టౌన్, ఫిబ్రవరి 20 : రాష్ట్రంలోనే అతిపెద్ద సంస్థానంగా గద్వాల సంస్థానానికి ప్రత్యేకత ఉన్నది. ఇంతటి ప్రాచుర్యం పొందిన సంస్థాన ఇలవేల్పు భూలక్ష్మీచెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు తరలిరానున్నారు. మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్సవాల్లో ప్రతి రోజూ ప్రత్యేక వాహనంపై స్వామివా రు ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే నిర్వాహకు లు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా విద్యుద్దీపాలతో గద్వాలకోట సరికొత్త శోభను సంతరించుకున్నది.
మాఘశుద్ధ మాసంలో అత్యంత వైభవంగా ని ర్వహించే బ్రహ్మోత్సవాలను 16 ఏండ్లుగా మంత్రాలయ మఠం నిర్వహిస్తున్నది. పౌ ర్ణమి రోజు రథోత్సవం నిర్వహించి వే డుకలు ఆరంభిస్తారు. గద్వాల సంస్థానాధీశుల కాలంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు మరింత శోభాయమానంగా నిర్వహించేవారని చరిత్ర చెబుతున్నది. కవులు, కళాకారులను సత్కరించేవారు. పెద్ద తేరుపై భూలక్ష్మీచెన్నకేశవస్వామి, శ్రీదేవి, భూదేవి, సీతారాములు, వేణుగోపాలస్వామి వేర్వేరు తేర్లపై ఊరేగేవారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన బ్రహ్మోత్సవాల నిర్వహణను మంత్రాలయ పీఠానికి అప్పగించాక ఉత్సవాల్లో కొంత ప్రాధాన్యత తగ్గిందని భక్తులు చర్చించుకుంటున్నారు. కాగా, నెలపాటు నిర్వహించే ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు నడిగడ్డ ప్రజలే కాకుండా పక్క రాష్ర్టాలైన ఆంధ్రా, కర్ణాటకకు చెందిన వేలాది మంది తరలివచ్చి ఉత్సవాలను తిలకించనున్నారు.
ఏడు రోజులపాటు నిర్వహించే ఉత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో మొదటి రోజు మూలవిరాట్కు నిత్య విశేష ఫలపంచామృత అభిషేకం, పుష్పాలంకరణ, పుణ్యాహవాచనం, సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 8 గంటలకు హనుమత్ వాహనంపై స్వామి ఊరేగింపు ఉంటుంది. 22న కల్యాణోత్సవం, గరుఢవాహనంపై ఊరేగిస్తారు. శనివారం స్వామి వారి రథోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.