నారాయణపేట/ నారాయణపేట టౌన్/ రూరల్, జనవరి 14: భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు, కుటుంబసభ్యులతో ఇండ్లన్నీ కళకళలాడాయి. మహిళలు సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా రంగు రంగులతో వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. చిన్నారులు, యువకులు పెద్దవారితో కలిసి పతంగులు ఎగురవేశారు. చిన్నారుల తలపై భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. మున్సిపల్ వైస్చైర్మన్ హరినారాయణ భట్టడ్ 17వ వార్డులో ముగ్గులు వేసిన 10మందికి నగదు పురస్కారం అందజేశారు. జాజాపూర్ గ్రామంలో మల్లయ్యస్వామిని పల్లకీలో ఊరేగించారు.
ఊట్కూర్, జనవరి 14: మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం ప్రజలు భోగి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు తెల్లవారుజామునే ఇండ్లముందు పేడతో కల్లాపి వేసి రంగు రంగుల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. యువతీ యువకులు భోగి మంట వేసి జానపద నృత్యాలతో ఆకట్టుకున్నారు. సజ్జ పిండితో చేసిన రొట్టెలు, పిండి వంటకాలతో విందు భోజనాలను ఆరగించారు. కురుమయాదవులు తమ కుల దైవం కర్ణాటక రాష్ట్రం మైలాపురం మల్లన్నస్వామిని దర్శించుకునేందుకు వాహనాల్లో తరలివెళ్లారు. మల్లేపల్లిలో సర్పంచ్ మాణిక్యమ్మ ఆధ్వర్యంలో యువతకు ముగ్గులు, పతంగులు, డ్యాన్స్ పోటీలు నిర్వహించి విజేతలకు వెండి బహుమతులు పంపిణీ చేశారు. యువత కోలాటం వేసి ఆకట్టుకున్నారు.
మక్తల్ టౌన్ జనవరి 14: భోగి పండుగను మక్తల్ మండలం వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఇంటి ముందు కాలనీ కూడళ్లలో భోగి మంటలు వేశారు. నదీస్నానం ఆచరించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో కృష్ణానదికి తరలి వెల్లారు.
కృష్ణ, జనవరి 14 : మండలకేంద్రంతోపాటు హిందుపూర్, గుడెబల్లూర్, కాన్దొడ్డి, ముడుమాల తదితర గ్రామాల్లో శనివారం ప్రజలు భోగి పండుగ జరుపుకొన్నారు. మహిళలు రంగవల్లలు వేసి గొబ్బెమ్మలను పెట్టి వాటిపై గుమ్మడి పూలను అలంకరించి అందరూ కలిసి గొబ్బమ్మ పాటలు పాడుతూ అస్వాదించారు. ఐదేళ్లలోపు పిల్లలకు భోగి పళ్లను పోశారు