ఇంటింటికీ శుద్ధ జలం.. వానకాలం మాట అటుంచితే.. ఎండాకాలంలోనూ తాగునీరు పుష్కలం. డబ్బులు పెట్టి కొనాల్సిన మినరల్ నీళ్లు ఇప్పుడు ఇండ్లల్లోనే నల్లా నుంచి ఉచితంగా వస్తున్నాయి. దీనికి సీఎం కేసీఆర్ రూపొందించిన మిషన్ భగీరథ పథకం సత్ఫలితాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ‘తాగు నీటి కోసం తెలంగాణ ఆడపడుచులు బిందెలతో రోడ్డెక్కొద్దు’ అన్న సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకం ప్రజల కష్టాలను దూరం చేసింది. నాగర్కర్నూల్ జిల్లాలో సుమారు 750 గ్రామాలను భగీరథ శుద్ధ జలాలు ముద్దాడాయి. శ్రీశైలం రిజర్వాయర్ వద్ద నాగార్జునసాగర్ నుంచి రివర్స్ పంపింగ్ కొనసాగించడంతో నిండువేసవిలోనూ పుష్కలంగా నీళ్లు సరఫరా కానున్నాయి.
– నాగర్కర్నూల్, మార్చి 30 (నమస్తే తెలంగాణ)
ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో తాగునీటిదే కీలకమైన స్థానం. దశాబ్దాల తరబడిగా తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. గతంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాగునీరు కూడా అందించని దుస్థితిలో ఉన్నాయి. ఎండాకాలంలో మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీలు, పురపాలికల కార్యాలయాలు, రోడ్ల వద్ద రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి. ఆయా పాలకవర్గాలు ట్రాక్టర్లు, ఆటోల ద్వారా సరఫరా చేసే చాలీ చాలని నీళ్లతో రాత్రింబవళ్లు నిద్రలు మాని బిందెలతో గొడవలు చేసుకునే పరిస్థితులు గతంలో సాధారణం. పంచాయతీలు బోర్లు వేయలేక, వేసినా భూగర్భ జలాలు లేక నీళ్లు పడక తాగునీటి సమస్య నిత్యకృత్యంగా ఉండేది. ఈ పరిస్థితులను గమనించిన సీఎం కేసీఆర్.. స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వమే ఇంటింటికీ ఉచితంగా తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చారు. 2016 ఆగస్టులో ఈ పథకాన్ని ప్రారంభించారు. నీటిని అందించేందుకు కృష్ణా నది నీటిని ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించి శుద్ధి చేపట్టి భారీ ట్యాంకుల ద్వారా గ్రామాల్లోని ట్యాంకులకు.. అక్కడి నుంచి కుళాయిల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నది. మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ లేని శుద్ధ జలాన్ని ఉచితంగా రూ.కోట్లాది నిధులతో అందజేస్తున్నారు. పంచాయతీలు, పురపాలికలకు సంబంధం లేకుండా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.దీంతో నాలుగేండ్లుగా సమస్య తీరింది.
ఈ నీళ్లు సంజీవనిగా ఉన్నాయని అధికారులు, ప్రజలు పేర్కొంటున్నారు. ఖనిజ, లవణాలు సమపాళ్లలో ఉండడంతో అనారోగ్య సమస్యలు తగ్గుతున్నాయి. ఎముకల పెరుగుదల సాఫీగా జరుగుతుంది. ముఖ్యంగా ఫ్లోరైడ్, మెగ్నీషియం, నైట్రేట్ తగిన మోతాదులో ఉండడంతో జీవక్రియ సాఫీగా ఉన్నది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలాంటి బృహత్తర తాగునీటి పథకంతో నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలతోపాటు దాదాపుగా 750 గ్రామాలకు తాగునీరు అందుతున్నాయి. కృష్ణానది జలాలతో శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులోని జలాశయం నుంచి మిషన్ భగీరథకు నీళ్లు అందుతున్నాయి. దీనికోసం ప్రభుత్వం కల్వకుర్తి, గౌరిదేవిపల్లిలో శుద్ధజల ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మొత్తమ్మీద దాదాపుగా రూ.2 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలో తాగునీటి సమస్య పూర్తిగా తీరిపోయింది. ప్రస్తుతం ఆంధ్రా భారీ ఎత్తున శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని తరలించడంతో మిషన్ భగీరథ పథకానికి నీటి సమస్య ఏర్పడే పరిస్థితులు వచ్చాయి. దీన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ ఆదేశాలతో శ్రీశైలంలో రివర్స్ పంపింగ్ చేపట్టారు. ఈ కారణంగా కృష్ణాలో నీళ్లు పెరిగాయి. ఇలా వారం రోజులపాటు మిషన్ భగీరథకు మూడు టీఎంసీల నీటిని మళ్లించారు. దీంతో ఈ వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇలా ప్రజలకు తాగునీటి సమస్య మిషన్ భగీరథ శాశ్వతంగా దూరం చేసింది.
మిషన్ భగీరథతో ఎండాకాలంలో తాగునీటి సమస్య పూర్తిగా తీరిపోయింది. గతంలో తాగునీళ్లకు ప్రజలు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ఎండాకాలంలో తాగునీటి సమస్య రాకుండా శ్రీశైలం రిజర్వాయర్లో రివర్స్ పంపింగ్ ద్వారా కృష్ణా నదిలో మూడు టీఎంసీలను మిషన్ భగీరథకు మళ్లించాం. మిషన్ భగీరథ నీటిలో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ప్రజలంతా ఈ నీటిని తాగి అనారోగ్యాలకు దూరంగా ఉండండి.
– శ్రీధర్, ఈఈ, ఆర్డబ్ల్యూఎస్