పాలమూరు, డిసెంబర్ 25: మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీ అయ్యప్పకొండపై ఆదివారం అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో మహాపడిపూజ వైభవంగా నిర్వహించారు. పడిపూజకు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. అయ్యప్ప ఇచ్చిన శక్తిసామర్థ్యాలతో మహబూబ్నగర్ జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి నెంబర్వన్లో నిలబెడుతానని అన్నారు. ఏటా అయ్యప్ప భక్తులు అన్నదానం, రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు.
అదేవిధంగా స్వామివారి కలశ, పల్లకీసేవతోపాటు శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో మంత్రి పాల్గొని అయ్యప్పస్వాములతో కలిసి భజనలు చేశారు. శోభాయాత్ర ప్రతి సంవత్సరం మాదిరిగానే తూర్పుకమాన్ ఆంజనేయస్వామి ఆలయం నుంచి అయ్యప్పకొండ వరకు నిర్వహించారు. శోభాయాత్రలో స్వాములు భజనలు, కోలాటాలు వేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. సాయంత్రం అయ్యప్పస్వామికి పుష్పాభిషేకం అనంతరం మహాపడిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహేశ్, కౌన్సిలర్లు రవికిషన్రెడ్డి, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు భగవంతరావు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అయ్యప్పభక్తులు తదితరులు పాల్గొన్నారు.