జడ్చర్ల టౌన్, డిసెంబర్ 18 : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డున పడేసిందని జడ్చర్ల ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్హాజీ అన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం జడ్చర్లలో ఆటోడ్రైవర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆటోయూనియన్ నాయకులు మాట్లాడారు. ఆటోలపై ఆధారపడిన మాకు జీవనాధారం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోల్లో గిరాకీ లేక ఆర్థికంగా నష్టపోతున్నామన్నారు.
కిస్తులు చెల్లించలేకపోతున్నామని, ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15వేలు ఆర్థిక సాయం చేయాలని కోరారు. అలాగే ఆటోడ్రైవర్లకు డబుల్బెడ్రూం ఇండ్లు, హెల్త్కార్డులు ఇవ్వాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు అశోక్, నర్సింగ్, ఇమ్రాన్, పెంటోజీ, లక్ష్మణ్, ఖాజపాషా, చాంద్పాషా, రవీందర్, రాఘవేందర్, కార్తీక్, మహేశ్, రాములు తదితరులు పాల్గొన్నారు.