ఊట్కూర్, మే 2: సర్కార్ బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫాంను అందించేందుకు చర్యలు ప్రారంభించింది. జిల్లాలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫాంను అందజేయనున్నారు. ప్రభుత్వ చర్యలతో జిల్లావ్యాప్తంగా 339 ప్రాథమిక, 85ప్రాథమికోన్నత, 91ఉన్నత, కేజీబీవీ, మోడల్ పాఠశాలల్లో చదివే మొత్తం 67,484 మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు మేలు జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూనిఫాంకు సంబంధించిన దుస్తులను జిల్లాలోని అన్ని ఎమ్మార్సీలకు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం సరఫరా చేసింది. కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో విద్యావసతులను మెరుగుపర్చేందుకు కలెక్టర్ శ్రీహర్ష ప్రత్యేక దృష్టిసారించారు. కలెక్టర్ చొరవతో యూనిఫాం తయారీకి అనుభవజ్ఞులైన దర్జీలను విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారు. పంపిణీలో అలసత్వం లేకుండా మే 31నాటికి తమకు అప్పజెప్పాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమయ్యే తొలిరోజు జూన్ 12న జిల్లాలోని అన్నిపాఠశాలల విద్యార్థులకు యూనిఫాం అందిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
విద్యార్థులను ఆకర్షించేలా..
విద్యార్థుల తల్లిదండ్రుల సూచన మేరకు ఈ విద్యాసంవత్సరం మన్నిక కలిగిన దుస్తులను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ బడుల్లో చదువుకునే విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరం పంపిణీ చేసే యూనిఫాం విషయంలో ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను పాటించనుంది. విద్యార్థుల మనసుకు హత్తుకునే విధంగా యూనిఫాం తయారీకి అనుభవం ఉన్న టైలర్లను ఎంపిక చేశారు. బాలబాలికలకు వేర్వేరుగా తరగతి, ఎత్తును దృష్టిలో ఉంచుకుని వివిధ సైజుల్లో యూనిఫాం తయారు చేసేందుకు దర్జీలతో కొలతలు తీసుకున్నారు. స్మాల్, మీడియం, లార్జ్, యావరేజ్గా విద్యార్థులను నాలుగు రకాలుగా విభజించి యూనిఫాం సిద్ధం చేస్తున్నారు. 1నుంచి 7వ తరగతి బాలురకు డార్క్ మెరూన్ కలర్ నిక్కర్, వైట్ మెరూన్ కలబోతతో షర్టు, 8నుంచి 12వ తరగతి విద్యార్థులకు డార్క్ మెరూన్ కలర్తో ప్యాంటు, షర్టు, 1నుంచి 3వ తరగతి బాలికలకు ఆకర్షనీయమైన డిజైన్తో తయారు చేసిన ఫ్రాక్, 4, 5 తరగతి బాలికలకు షర్ట్ విత్ ఫ్రాక్, 6 నుంచి 12వ తరగతి బాలికలకు పంజాబీ యూనిఫాం అందజేయనున్నట్లు విద్యాశాఖ ఓఎంవో తెలిపారు.
మండలాలవారీగా ఇలా..
దామరగిద్ద మండలంలో 47పాఠశాలల్లో బాలుర 3, 264, బాలికలు 3, 395, ధన్వాడ మండలంలో 39పాఠశాలల్లో బాలుర 2,683, బాలికలు 2,651, కోస్గి మండలంలో 68పాఠశాలల్లో బాలుర 3,877, బాలికలు 3,764, కృష్ణ మండలంలో 24 పాఠశాలల్లో బాలుర 1,621, బాలికలు 1,935, మద్దూర్ మండలంలో 83పాఠశాలల్లో బాలుర 3,974, బాలికలు 4,152, మాగనూర్ మండలంలో 25పాఠశాలల్లో బాలుర 1,672, బాలికలు 1,829, మక్తల్ మండలంలో 59 పాఠశాలల్లో బాలుర 4,239 బాలికలు 4,401, మరికల్ మండలంలో 27 పాఠశాలల్లో బాలుర 1,728, బాలికలు 1,951, నారాయణపేట మండలంలో 70 పాఠశాలల్లో బాలుర 4, 676, బాలికలు 5,091, నర్వ మండలంలో 26 పాఠశాలల్లో బాలుర 1,961, బాలికలు 2,227, ఊట్కూర్ మండలంలో 47 పాఠశాలల్లో బాలుర 3,050, బాలికలు 3,343 విద్యార్థులు చదువుతున్నారు.
పైసా భారం లేదు
మా పిల్లలను సర్కార్ బడిలోనే చదివిస్తున్నా. నాపైన పైసా భారం లేదు. మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, స్కూల్డ్రెస్సు, స్కాలర్షిప్పు సర్కారే అందజేస్తుంది. ప్రైవేట్ స్కూళ్లకు మించి పాఠాలు బోధిస్తున్నారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– రాజు, పేరెంట్, నిడుగుర్తి గ్రామం
ఆనందంగా ఉంది
నేను 7వ తరగతి చదవుతున్నా. అమ్మానాన్న కూలీ పనులు చేస్తున్నారు. నా చదువుకు వారిపై ఎలాంటి భారం లేదు. ప్రభుత్వం నుంచి ఉచితంగా రెండు జతల యూనిఫాం ఇచ్చేందుకు కొలతలు తీసుకున్నారు. చాలా ఆనందంగా ఉంది.
– చైతన్య, విద్యార్థిని, యూపీఎస్, నిడుగుర్తి
పునఃప్రారంభం రోజే..
మా పాఠశాలలో మొత్తం 340మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యా శాఖ గైడ్లెన్స్ ప్రకారం జూన్ 12న విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందించాలని ఆదేశాలు అందా యి. ప్రభుత్వ చర్యలతో తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడి విద్యార్థుల సంఖ్య పెరిగింది.
– లక్ష్మారెడ్డి, హెచ్ఎం, నిడుగుర్తి యూపీఎస్