నాగర్ కర్నూల్ : సీఎం బందోబస్తు( CM Security ) విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్( Nagar Kurnool ) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఉల్పర గ్రామానికి చెందిన మద్దమల్ల రాజు( Raju ) 2014 బ్యాచ్ ఏ ఆర్ కానిస్టేబుల్ ( AR Constable )గా ఎంపికై నాగర్ కర్నూల్ ఆర్ముడ్ రిజర్వులో విధులు నిర్వర్తిస్తున్నాడు.
గత రెండు రోజులుగా సీఎం బందోబస్తు నిమిత్తం సోమశిలలో విధులు నిర్వర్తిస్తు శుక్రవారం సాయంత్రం సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా మామిళ్ళపల్లి గ్రామం సమీపంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న ఉప్పునుంతల పోలీసులు మృతదేహాన్ని అచ్చంపేట గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ స్పందిస్తూ కానిస్టేబుల్ రాజు మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.