అమ్రాబాద్, డిసెంబర్ 26 : పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఉత్సవాలు మంగళవారం గాయత్రీ మహాయజ్ఞంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం విఘ్నేశ్వరపూజ గవ్యాంతరపూజ, మన్యుసూక్తములతో ఆంజనేయస్వామి వారికి 108 కలశములతో మహాకుంభాభిషేకం నిర్వహించిన అనంతరం వేద పండితులు హనుమాన్ గాయత్రీ మహాయజ్ఞం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. హనుమాన్ మాలధారణ స్వాములు స్వామి సన్నిధికి చేరుకొని ఇరుముడులను సమర్పించి మాల విరమణ చేశారు.
స్వాములు, భక్తులు గోధుమపిండి, బెల్లంతో చేసిన ప్రత్యేక నైవేద్యాన్ని అంజన్నకు సమర్పించి గుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉత్సవాలను పూర్తి చేసిన ఆలయ సిబ్బందికి, భక్తులకు సహకరించిన ప్రజలకు ఆలయ ఈవో రంగాచారి ధన్యవాదాలు తెలిపారు.