కల్వకుర్తి రూరల్, జనవరి 18 : రెండ్రోజుల కిం దట అదృశ్యమైన వృద్ధురాలు హత్యకు గురైన ఘటన గురువారం మండలంలో చోటు చేసుకున్నది. పోలీసులు కథనం మేరకు.. కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన గాదమోని శంకరయ్యగౌడ్ భార్య నాగమ్మ (60) రెండ్రోజుల కిందట వం గూరు మండలం ఉల్పర గ్రామంలో ఉన్న కోడలు ఇంటికి వెళ్లేందుకు కల్వకుర్తి బస్టాండ్కు చేరుకున్నది. బస్ లేకపోవడంతో అక్కడే కూర్చున్నది. ఆ మెను గమనించిన ఒక వ్యక్తి, మరో మహిళ మాటామాటా కలిపి ఉల్పరకు వెళ్తున్నామని నమ్మబలికి ఆటోలో తీసుకెళ్లారు.
అచ్చంపేట నియోజకవర్గం మన్ననూర్ అటవీ ప్రాంతం వైపునకు తీసుకెళ్లి సీసాతో గొంతుకోసి వృద్ధురాలి ఒంటిపై ఉన్న బం గారు ఆభరణాలు అపహరించుకువెళ్లారు. నాగమ్మ ఉల్పరకు వెళ్లకపోవడంతో విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్టాండ్లో రికార్డు అయిన సీసీ కెమెరా ఆ ధారంగా నిందితుడిని గుర్తించారు. నాగమ్మను హత్య చేసిన ప్రదేశం వద్ద మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలికి భర్త, ఐదుగురు సంతానం ఉన్నారు.