గద్వాల: లబ్దిదారులు రెండు పడక గదుల ఇండ్లు ( Two BHK Houses ) అద్దెకిస్తే కేటాయింపులు రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ( Collecotr Rizwan Basha ) తెలిపారు. గద్వాల పట్టణ శివారులోని రెండు పడక గదుల ఇండ్ల సమీపంలో జిల్లా ఆసుపత్రి, మెడికల్, నర్సింగ్ కళాశాలలు, సెంట్రల్ మెడిసిన్, స్టోర్స్ భవనాలు నిర్మించడంతో ఈ ప్రాంతం మెడికల్ హబ్ గా అభివృద్ధి చెందబోతోందని అన్నారు. గురువారం గద్వాల శివారులో రూ. 5.7 కోట్ల నిధులతో నిర్మిస్తున్న ఇందిర మహిళా శక్తి భవనంతో పాటు , కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. మెడికల్, నర్సింగ్ కళాశాలల భవనాలు, రెండు పడక గదుల ఇండ్ల సముదాయంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిర మహిళా శక్తి భవన నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు.
కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. రెండు పడక గదుల ఇండ్లను సందర్శించిన కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడారు. రెండు పడక గదుల ఇండ్లల్లో అర్హులైన లబ్ధిదారులే నివాసం ఉండాలని, అద్దెకు ఇవ్వడం, అమ్ముకోవడం వంటివి చేస్తే కేటాయింపు రద్దుచేసి ఇతర అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్, డీఈ లక్ష్మన్న, డీఈవో విజయలక్ష్మి, టీజీఎంఎస్ ఐడీసీ డీఈ శ్రీనివాసులు, ఏఈ రహీం, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, తదితరులున్నారు.