మహబూబ్నగర్ కలెక్టరేట్, జూన్ 10 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలన్నింటినీ పరిష్కరించి ఈ రెండు నెలల్లో పరిహార ప్యాకేజీ చెల్లింపులన్నీ పూర్తి చేయాలని భూ సేకరణ పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్అండ్ఆర్) రాష్ట్ర కమిషనర్ శివకుమార్నాయుడు అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో బుధవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉదండాపూర్, కోయిల్సాగర్, కల్వకుర్తి, రాజీవ్ భీమా ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్అండ్ఆర్ పనులతో పాటు ప్రతిపాదిత లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ అనుసంధాన టన్నెల్ భూ సేకరణపై ఆరా తీశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉదండాపూర్, వల్లూర్ గ్రామాలతోపాటు రేగడిపట్టి, చిన్నగుట్ట, తుమ్మలకుంట, శ్యామగడ్డ, ఒంటిగుడిసె, పోలేపల్లి మొత్తం ఆరు తండాలు ముంపునకు గురవుతున్నట్లు రెవెన్యూ అధికారులు రాష్ట్ర కమిషనర్కు నివేదించారు.
1890 మంది నిర్వాసితుల ఖాతాల్లో నిధులు జమ చేశామని, మిగిలిన అర్హులైన వారికి అవార్డ్ పాస్ చేసి త్వరలో పరిహారం అందజేస్తామని ఆర్అండ్ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాజెక్టు ఆఫీసర్ తెలిపారు. ఉదండాపూర్ ముంపు బాధితులకు కేటాయించిన 280ఎకరాల పునరావాసం లేఅవుట్ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. కమిషనర్ స్పందిస్తూ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ పనులన్ని త్వరగా పూర్తి చేసి బాధితులకు ప్లాట్లు అప్పగించాలని సూచించారు. పునరావాస కేంద్రం సరిహద్దు వివాదాలు పరిష్కరించాలని జడ్చర్ల తాసీల్దార్, సర్వేల్యాండ్ రికార్డ్స్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సబ్స్టేషన్ పనుల కోసం వారం రోజుల్లో రూ.3కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు. అనంతరం కోయిల్సాగర్ ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, రాజీవ్భీమా ప్రాజెక్టు, పీఆర్ఆర్ఎల్ఐ ప్రాజెక్టుల భూ సేకరణ, ఆర్అండ్ఆర్ పెండింగ్ సమస్యలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్రెడ్డి, ఆర్డీవో నవీన్, సర్వేల్యాండ్ రికార్డ్సు ఏడీ అశోక్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.