తెల్లబంగారం కొనుగోలులో దళారులు గోల్మాల్ చేస్తున్నారు. పత్తి పంట చేతికి రావడంతో గ్రామాల్లోకి డేగల్లా రంగప్రవేశం చేశారు. రైతన్నలను తూకాలతో మోసగిస్తున్నారు. పంట విక్రయానికి కర్షకులు సన్నద్ధమవుతుండటంతో కొనుగోలు కేంద్రాలకు రాకముందే దళారులు ఊళ్లకు చేరుకొంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా తక్కువ తూకంతో అన్నదాతలను నిలువునా ముంచుతున్నారు. అరికట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ గాలికొది లేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే కొనుగోళ్లు ప్రారంభం కావడంతో అధికారులు చర్యలు తీసుకోకుంటే మరింత మోసపోయే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే తెలకపల్లి మండలంలో రిమోట్ కంట్రోల్తో పనిచేసే కాంటాతో మోసం చేయడంతో పోలీసు కేసు నమోదైంది. త్వరలో ధాన్యం కొనుగోలు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకోవాలని కర్షకులు కోరుతున్నారు.
నాగర్కర్నూల్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఈ వానకాలం సీజన్లో పండిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రై తన్నలను దోచుకునేందుకు దళారులు గ్రామాల్లో తిష్ట వేస్తున్నారు. ప్రభుత్వం సీసీఐ ద్వారా చేపట్టిన పత్తి కొ నుగోళ్లు ఇటీవలే ప్రారంభమయ్యాయి. నాగర్కర్నూ ల్ జిల్లాలో 3.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకాగా.., 3.55 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అ ధికారుల అంచనా. దీనికిగానూ జిల్లాలో 15 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. క్వింటాకు రూ. 6,380 మద్దతు ధరను నిర్ణయించింది. ఇక వరి సై తం 3.29 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంద ని అంచనా కాగా, 224 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం పత్తి కొనుగోళ్లు జరుగుతుండ గా, మద్దతు ధరకు మించి డిమాండ్ వస్తున్నది. దీం తో రైతులు కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకెళ్లక ముందే దళారులు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నా రు.
ఇంటి వద్దే పత్తిని అమ్ముకోవచ్చనుకున్న రైతులను దళారులు ద గా చే స్తున్నారు. తూకాల్లో మోసాలకు పాల్పడుతూ నిలువునా ముంచేస్తున్నారు. తెలకపల్లి మండలంలోని గట్టునెల్లికుదు రు, గౌతంపల్లి తదితర గ్రామాల్లో ఓ వ్యాపారి రైతులను తూకాల్లో మోసం చేసి పత్తి కొనుగోలు చేశాడు. బిజినేపల్లికి చెందిన ఓ దళారి.. పలు గ్రామాల్లో క్వింటాకు రూ. 7,300 చొప్పున కొనుగోళ్లు చేపట్టారు. దీంతో రైతులు ద ళారులకు అమ్ముకొంటున్నారు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. క్వింటాకు ఎనిమిది కేజీల చొప్పున అదనంగా పత్తిని తూకం చేస్తూ దగాకు పాల్పడుతున్నారు. పత్తిని తూచే కాంటా రిమోట్ సిస్టం కావడంతో రైతులు మొదట పసిగట్టలేకపోయారు. పలు గ్రామాల్లో దళారులు పత్తిని కొనుగోలు చేస్తుండడంతో.. అనుమానం వచ్చిన రైతులు రిమోట్ కాంటా మోసాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. కాగా, ఇప్పటికే అమ్ముకున్న రైతులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి దళారులు ఇంకా చాలా మంది ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా పత్తి సాగుకావడంతో దళారులు తూకాల మాటున మోసాలకు పాల్పడుతున్నారు. అయితే, ఈ మోసాలను అరికట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ.. పర్యవేక్షణ మరిచిందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావడంతో అధికారులు తనిఖీలు చేపట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఇంకా కొనుగోళ్లు జరగనుండడం, త్వరలో వరి కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు దళారులను అరికట్టేలా కఠినంగా వ్యవహరించాల్సి ఉన్నది.
తనిఖీలు ముమ్మరం చేస్తాం..
తెలకపల్లి మండలంలో తూకాల్లో జరుగుతున్న మోసాలపై పోలీసు కేసు నమోదైంది. తూనికలు, కొలతలు, మార్కెటింగ్, విజిలెన్స్ శాఖలతో సమావేశం నిర్వహిస్తాం. త్వరలో ఆయా శాఖల అధికారులతో గ్రామాల్లో తనిఖీలు ముమ్మరంగా చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. రైతులు ఎక్కడైనా మోసాలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలి. దళారుల మాయమాటలను నమ్మొద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి, ధాన్యాన్ని విక్రయించాలి. అధిక మద్దతు ధర పేరుతో వ్యాపారులు ఇలాంటి మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నది. – మోతీలాల్, అదనపు కలెక్టర్, నాగర్కర్నూల్