మహబూబ్నగర్మెట్టుగడ్డ, జనవరి 13: అన్ని గ్రామాలు, పట్టణాల్లో కంటివెలుగు కార్యక్రమంపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లో శుక్రవారం వైద్యాధికారులు, ఆప్తాలమిస్టులు, సూపర్వైజర్లు, కంటివెలుగు వైద్యబృందాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కంటి సమస్యలు ఉన్న వారిని గుర్తించి వైద్యశిబిరాలకు తీసుకురావాల్సిన బాధ్యత ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులదేనని తెలిపారు.
శిబిరాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూ చించారు. ముఖ్యంగా టెంటు, తాగునీరు ఇతర సౌకర్యాలను కల్పించాలని, ఇందుకుగానూ ప్రభుత్వం నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే వైద్య బృందానికి భోజన వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నా రు. కంటివెలుగు శిబిరాలకు వచ్చే వారు తప్పనిసరిగా ఆధార్, ఫోన్ నెంబర్తో రావాలని, దీనిపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లావ్యాప్తంగా కంటివెలుగు శిబిరాల ప్రారంభోత్సవాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొనేలా చూడాలని తెలిపారు. కంటివెలుగు నిర్వహణపై 16న మరోసారి సన్నాహక శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్వో కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్వో భాస్కర్నాయక్, కంటివెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ మోతీలాల్, వినోద్రెడ్డి, డాక్టర్ శశికాంత్. డెమో అధికారి తిరుపతిరావు ఉన్నారు.