కొల్లాపూర్, ఏప్రిల్ 7: కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్లో నల్లమల అడవిలోని అంకిల్పెంట ప్రదేశంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్, బీట్ ఆఫీసర్ స్వామిపై బుధవారం దాడికి పాల్పడిన లింగాల మండల కేంద్రానికి చెందిన ఏడుగురు వెదురు కలప స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి కిష్టాగౌడ్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఉద్యోగులు మహబూబ్నగర్ ఎస్వీఎస్ దవాఖానలో చికిత్స పొందుతున్నారన్నారు. గురువారం పట్టణంలోని ఎఫ్ఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్మగ్లర్లు తరలిస్తున్న మూడు వెదురు కలప ఎడ్లబండ్లను అచ్చంపేట టింబర్ డిపోకు తరలించామన్నారు. దాడికి పాల్పడిన వారిలో లింగాలకు చెందిన శ్రీనువాసులు, ఆంజనేయులు, శంకర్, కాశీం, మల్లయ్య, మైసయ్య, వెంకటయ్య ఉన్నారని, వీరిపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు వివరించారు.
నల్లమలలోని కృష్ణానది తీరంలో అమరగిరి సమీపంలోని చీమలతిప్ప ఐలాండ్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు కిష్టాగౌడ్ చెప్పారు. సోమశిలకు పర్యాటకుల రద్దీ అధికం కావడంతో ప్రత్యామ్నాయంగా అమరగిరి ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో ఫారెస్ట్ రేంజర్ శరత్చంద్రారెడ్డి, సెక్షన్ ఆఫీసర్లు పద్మారావు, సత్యం ఉన్నారు.