నాగర్ కర్నూల్ : జిల్లాలోని వెల్దండ మండలం అజిలాపూర్( Ajilapur ) గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని ( Fire Incident ) కారు, 10 గొర్రె పిల్లలు, 5 పొట్టేళ్లు, పశువుల ఎరువు కుప్పలు, కాలిపోయాయి. గ్రామ శివారులో ఉన్న పొలంలో మొక్కజొన్న సొప్పకు మంగళవారం తెల్లవారుజామున నిప్పు అంటుకుంది. ఆ మంట వ్యాపించి పొలం పక్కన ఉన్న షెడ్డుకు అంటుకుంది.

షెడ్డులో కాలే నిరంజన్ అనే వ్యక్తికి చెందిన కారుకు నిప్పు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. పక్కనే ఉన్న గొర్రెల మందకు సైతం అంటుకోవడంతో ఐదు గొర్రె పొట్టేలు, పది గొర్రె పిల్లలు మంటలో కాలిపోయాయి. ఎరువుల కుప్పలు దగ్ధమయ్యాయి. స్థానికులు ఫైర్ ఇంజన్కు సమాచారం అందించడంతో వారు చేరుకునే లోపే కారు, షెడ్లు, గొర్రెలు దగ్ధమయ్యాయి.

ఘటన స్థలాన్ని వెల్దండ సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్సై యుగంధర్ రెడ్డి పరిశీలించారు. పంట కు ఎవరైనా నిప్పంటించారా? లేక ప్రమాదవశాత్తు నిప్పంటుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.