Tiger | కొల్లాపూర్, మార్చి 23 : ఏపీ సరిహద్దుల నుంచి తెలంగాణలోకి తల్లి పులి వచ్చింది. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం ప్రాంతంలో చెట్లపొదళ్లో నాలుగు ఆడపులి పిల్లలకు జన్మనిచ్చిన తల్లి పులి 6వ తేదీన కృష్ణానది దాటి మన రాష్ట్రంలోని కొల్లాపూర్ సమీపంలో ఉన్న నల్లమల అడవులకు చేరిందన్న అనుమానాలను స్థానిక అటవీ శాఖాధికారులు వ్యక్తం చేశారు. కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని సులాలకుంట అటవీలో ఫారెస్ట్ అధికారులు అమర్చిన సీసీ కెమెరాలో ఓ ఆడ పులి ట్రాప్ అయినట్లు రెండ్రోజుల కిందట అధికారులు గుర్తించారు. అయితే ఆంధ్రా నుంచి వచ్చిన పులేనా.. లేక వేరేదా అన్న విషయమై ఫారెస్ట్ ఆఫీసర్లు స్పష్టత ఇవ్వలేదు.
పులిని గు ర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా వేసవి రావడంతో కృష్ణానదిలో నీటిమట్టం తగ్గింది. అయితే నది నీటి ప్రవాహం దాటి ఈ ప్రాంతానికి పులి వచ్చే అవకాశమే లే దని అధికారులు చెబుతున్నారు. అయితే 21న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ క్షితిజ దంపతులు సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న సమయంలో ఏపీలోని ఆత్మకూరు అటవీ డివిజన్ అధికారులు అక్కడకు చేరుకొని ఆమెను కలిశారు. అక్కడి నుంచి పిల్లలకు జన్మనిచ్చిన తల్లి పులి నల్లమలకు చేరినట్లు తెలిపినట్లు సమాచారం. దీంతో ఆమె కొల్లాపూర్ రేంజ్ అధికారులను అప్రమత్తం చేయడంతో నిఘా ఏర్పాటు చేశారు.
రెండ్రోజుల కిందట సులాలకుంట ప్రాంతంలో ఆడ పులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ విషయంపై ఇరు ప్రాంతాల అటవీశాఖాధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ శరత్చంద్రారెడ్డిని ‘నమస్తే’ సంప్రదించగా.. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన ఆడపులి, ఆంధ్రాలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన పుల్లి ఒక్కటేనా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు.