హన్వాడ, మార్చి 31 : మండలంలోని కొనగట్టుపల్లి గ్రామానికి అరుదైన గౌరవం దక్కింది. గ్రామంలో 1700 మంది జనాభా, 1,165 ఓటర్లు ఉన్నారు. పది వార్డుల్లో 182 మందికి పింఛన్లు అందిస్తున్నారు. గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు పూర్తి చేశారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. నిత్యం చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.
ఆయుష్మాన్ భారత్ కింద 1,545 మందిని చేర్పించారు. అంగన్వాడీ సెంటర్ ద్వారా గర్భిణులు, బాలింతలను గుర్తించి ఆరోగ్యంపై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. రూ.12.50 లక్షలతో శ్మశానవాటిక, రూ.3లక్షలతో డంపింగ్ యార్డు, రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ.5 లక్షలతో బస్టాండ్ నిర్మించారు. రూ.4 లక్షలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ సహకారంతో గ్రామంలో రూ.కోటితో సీసీరోడ్లు, డ్రైనేజీలతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. ఇంటింటికీ నల్లా బిగించి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామానికి రెండో సారి రాష్ట్ర స్థాయి అవార్డులు రావడం విశేషం.