గిరిజనేతరులు మూడు తరాలుగా భూమిని సాగు చేస్తూ ఉండాలి. అంటే 75 ఏండ్లుగా భూమిపై ఆధారపడి జీవించాలి. అటవీ హక్కుల ప్రకారం ప్రతి గిరిజనుడికి పదెకరాల వరకే అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి మించి ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. 2005 కంటే ముందు నుంచి సాగులో ఉండాలి.
నాగర్కర్నూల్/వనపర్తి, నవంబర్ 18 (నమస్తే తె లంగాణ) : దశాబ్దాలపాటు పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. పోడు రైతులు, అటవీ, పంచాయతీ, రెవెన్యూ శా ఖల మధ్య జరుగుతున్న వివాదాలు సమసిపోనున్నా యి. గతేడాది నవంబర్లో గ్రామ స్థాయిలో పోడు రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. ఆర్వోఎఫ్ఆర్ చట్టం-2006లో రాకముందు, వచ్చాక అని రెండు రకాలుగా వర్గీకరించింది. దీని ప్రకారం 1930 నుంచి సాగు చేస్తున్న గిరిజనేతరులు, 2005కు ముందు సాగు చేస్తున్న గిరిజనులకు మాత్రమే పరిమిత సంఖ్యలో హక్కు పత్రాలు మంజూరయ్యాయి. ఇంతకుముందు 2008-09, 2011-12లో ఇలా కొందరికి పట్టాలిచ్చారు. కాగా, 2006 కంటే ముం దు సాగులో ఉన్న, అప్పట్లో దరఖాస్తు చేసుకోని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ క్రమంలో పోడు భూములను స ర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
2005 డిసెంబర్ 19 నా టికి సాగులో ఉన్న పోడు భూముల ఫొటోలను అధికారుల బృం దాలు డౌన్లోడ్ చేసుకొని.. రైతుల దరఖాస్తులను బట్టి ఏయే స ర్వే నెంబర్లలో ఎంత విస్తీర్ణంలో, ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారనే వివరాలను సేకరించారు. దరఖాస్తులో ఉన్న కోడ్ నెంబర్, సర్వే నెంబర్, రైతుపేరు నమోదు చేసి అక్కడే రైతు ఫొటో తీసుకున్నారు. ఆ భూమికి నాలుగు వైపులా ఏయే రైతులున్నారనే వివరాలు తెలుసుకొని.. తదుపరి ఒక్క అంగుళం కూడా భూమిని ఆ క్రమించమని పోడు రైతులతో సంతకాలు తీసుకొంటూ ప్రమాణాలు కూడా చేయించారు. ఇలా అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారుల బృందాలతో చేపట్టిన పోడు భూముల సర్వే దాదాపుగా పూర్తయ్యింది. గూగుల్ ఎర్త్ మ్యాప్లతో సర్వేను పకడ్బందీగా నిర్వహించారు. ఈ క్రమంలో రెండు రోజుల్లో గ్రా మ సభలు నిర్వహించనున్నారు. ఇప్పటికే గుర్తించిన రైతుల వివరాలను బట్టి లబ్ధిదారులను ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియ నవంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేయనున్నారు. గ్రామ సభల్లో గు ర్తించిన లబ్ధిదారులు, విస్తీర్ణాలను ప్రభుత్వానికి నివేదిస్తారు. అ నంతరం ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలకు అనుగుణంగా పోడు రైతులకు భూమి హక్కులపై స్పష్టత రానున్నది. మొత్తమ్మీద వచ్చే నెలలో పోడు రైతులకు ప్రభుత్వం శుభవార్తను అందించనున్నది. దీంతో వారిలో సంతోషం వెల్లివిరుస్తున్నది.
నాగర్కర్నూల్ జిల్లాలో..
పోడు భూములపై దరఖాస్తులు స్వీకరించకముందు అధికారుల అంచనా మేరకు 2,302 మంది చెంచులు, చెంచేతరులు 7,449 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు భావించారు. అయితే, దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక ఊహించిన దాని కంటే అధికంగా వినతులు రావడం కొసమెరుపు. ఏకంగా 11,500 మంది 35 వేల ఎకరాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 4,614 మంది ఎస్టీలు.. 17,166 ఎకరాలకు, 5,517 మంది గిరిజనేతరులు 18,024 ఎకరాల కోసం వినతులిచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్కర్నూల్లోనే అత్యధికంగా పోడు భూములు ఉన్నాయి. జిల్లాలోని 65 గ్రామ పంచాయతీలు, 76 ఆవాసాల పరిధిలో రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. అమ్రాబాద్ మండలం మాచారం, చిట్లంకుంట, లక్ష్మాపూర్, కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం, మొలచింతలపల్లి, సోమశిల, పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండతండా, మారేడుమాన్దిన్నె తండా, అచ్చంపేట, పదర, లింగాల మండలాల్లో అధిక సంఖ్యలో పోడు రైతులు ఉన్నారు.
వనపర్తిలో వేగవంతంగా సర్వే..
దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని పోడుభూముల స మస్యలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. సమగ్ర సర్వే చేసి అర్హులకు పట్టాలు అందజేసేందుకు సిద్ధమైంది. దీ నికి సంబంధించిన సర్వే వనపర్తి జిల్లాలో వేగవంతంగా జరుగుతున్నది. ఈ నెల 24వ తేదీ వరకు సర్వే చేసేందుకు తుది గడువు ఉండడంతో రెవెన్యూ, ఫారెస్ట్, గిరిజన సంక్షేమ, అట వీ శాఖ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నది. సమావేశాలు ఏర్పాటు చేసి వాస్తవాలను అంచనా వేస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల ప్ర కారం ఆక్రమణకు గురైన అటవీ భూములను గుర్తించి.. వాటి సమీప గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో అటవీ హక్కుల కమిటీ (ఎఫ్ఆర్సీ) వేసి సర్వే చేపడుతున్నారు. నిర్దేశించిన గ్రా మాల్లో సభలు నిర్వహించి కమిటీల్లో సభ్యులను ఎంపికచేసి ప్రక్రియను వేగవంతం చేశారు. పోడుభూముల వ్యవహారం లో ఈ కమిటీ కీలకంగా వ్యవహరించనున్నది. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం పట్టాలు అందజేయనున్నది. ఇందుకోసం గ్రామ కమిటీల నుంచి ఉన్నతాధికారుల వరకు మూడు దశల్లో వడపోత చేస్తున్నారు. కా గా, జిల్లాలో 28,344 ఎకరాల అటవీ భూమి ఉండగా.. 2,3 79 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు తెలిపారు. 35 గ్రామాల్లోని 3,228 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
నెలాఖరులో గ్రామ సభలు..
ప్రభుత్వ ఆదేశానుసారం నాగర్కర్నూల్ జిల్లాలో పోడు భూములపై సర్వే దాదాపు పూర్తయ్యింది. 11వేల మందికిపైగా రైతులు 34 వేల ఎకరాలపై హక్కుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దీని కోసం పంచాయతీ, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో కూడిన 138 బృందాలతో సర్వే చేపట్టాం. రెండు రోజుల్లో గ్రామ సభలు ప్రారంభించి నెలాఖరుకు పూర్తి చేస్తాం. గ్రామసభల్లో చర్చించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటాం.
– పి.ఉదయ్కుమార్, కలెక్టర్, నాగర్కర్నూల్
24 కల్లా పూర్తి చేస్తాం..
వనపర్తి జిల్లాలోని 35 గ్రామ పంచాయతీల్లో అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఇప్పటికే గ్రామస్థాయిలో కమిటీలు వేశాం. సర్వే వేగవంతంగా జరుగుతున్నది. ఈ నెల 24కల్లా పూర్తిచేస్తాం. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,228 దరఖాస్తులు వచ్చాయి. ఇంకా పెరిగే అవకాశమున్నది. సర్వే వివరాలను సబ్ డివిజినల్ కమిటీకీ రెఫర్ చేస్తారు. సర్వేచేసిన భూమికి హద్దులు నిర్ణయించి జిల్లా స్థాయి కమిటీకీ పంపిస్తారు. వారు పరిశీలించిన అనంతరం పట్టాలు ఇచ్చేందుకు అర్హత వస్తుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భవిష్యత్లో అటవీభూమి ఆక్రమణకు గురికాకుండా హద్దులు ఏర్పాటు చేస్తాం.
– షేక్యాస్మిన్ బాషా, కలెక్టర్, వనపర్తి