గద్వాల : గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళిక ( Comprehensive Plan) రూపొందించుకుంటే వివిధ నిధులను సద్వినియోగం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ( Collector Rizwan ) అన్నారు.
గురువారం 2026-2027 ఆర్థిక సంవత్సరానికి గాను 16వ ఆర్థిక సంఘం నిధుల సద్విని యోగానికి రూపొందించాల్సిన గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ప్లాన్, బ్లాక్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్, డిస్ట్రిక్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్పై ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు నిర్వహించిన వర్క్షాప్లో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు.
గ్రామపంచాయతీలకు వివిధ పన్నుల ద్వారా వచ్చే జనరల్ ఫండ్తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, దాతల విరాళాలతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పక్కా ప్రణాళిక రూపొందించుకుంటేనే ఆయా నిధులను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ సబ్ కి యోజన, సబ్ కా వికాస్ సైట్ లో జీపీడీపీ వివరాలను ఈనెల 30వ తేదీలోగా అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు.
అధికారుల అలసత్వంతో నిధులు వెనక్కి వెళితే సహించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీపీవో శ్రీకాంత్, మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్ రెడ్డి, డీఆర్డీవో ముషాహిదా బేగం, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.