మహబూబ్నగర్, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల శాసనమండలి ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. గురువారం సీఎంతో సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేసేందుకు బారులుదీరారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో 10 (నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్, కొడంగల్, షాద్నగర్) పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 8 చోట్ల 100 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా మరో రెండు చోట్ల ఇద్దరు స్థానిక ప్రజాప్రతినిధుల గైర్హాజరుతో మొత్తం 1,439 మంది ఓటర్లగానూ 1,437 మంది వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 99.86 శాతం పోలింగ్ నమోదైంది. కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గద్వాలలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, మహబూబ్నగర్లో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి ఓటు వేయగా.. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి పలు కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసి ఆయా జిల్లా కలెక్టర్లు కంట్రోల్ రూమ్ల వద్ద పర్యవేక్షించారు. మహబూబ్నగర్లోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవినాయక్, నారాయణపేటలో కలెక్టర్ కోయ హర్ష, వనపర్తిలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, గద్వాలలో కలెక్టర్ బీఎం సంతోష్, నాగర్కర్నూల్లో కలెక్టర్ ఉదయకుమార్ కేంద్రాలను పరిశీలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్ ఆయా జిల్లా ఎస్పీలతో కలిసి జోగుళాంబ జోన్ డీఐజీ చౌహాన్ పర్యవేక్షించారు. ఎక్కడా చిన్న ఘర్షణ కూడా చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పార్టీల వారీగా ప్రజాప్రతినిధులు ఓటేసి వెళ్లిపోయారు. ఓటర్ గుర్తింపు కార్డులతోపాటు ఆధార్ కార్డులను కూడా తీసుకొచ్చి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ప్రాధాన్యతా క్రమంలో ఓటేసే అవకాశం ఉండటంతో ప్రజాప్రతినిధులను పో లింగ్ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి కూర్చోబెట్టారు. ఒక్కొక్కరినీ ఓటు వేసేందుకు పంపించారు. కేంద్రాల వద్ద ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో సాఫీగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే కొన్ని కేంద్రాల వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియాను అనుమతించకుండా కొద్దిసేపు బయటనే ఉంచారు. కాగా ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకున్నది. సొంత అన్న కొడుకు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నా మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడ్డారు. మొన్నటివరకు బీఆర్ఎస్లో ఉన్న జీవన్రెడ్డి ప్లేట్ ఫిరాయించి అధికార పార్టీ వైపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కాకా బాబాయ్ మాత్రం గులాబీ పార్టీ సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. కాగా ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో ఎక్స్ అఫీషియల్ సభ్యునిగా ఉన్న శ్రీనివాస్రెడ్డి పార్టీ అభ్యర్థికి ఓటేశారన్న సమాచారంతో కుటుంబాలు ఒక్కటైనా.. పార్టీలు, సిద్ధాంతాలు వేరని నిరూపించారు. చాలా చోట్ల అధికార పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. కొంతమంది ఏజెంట్లుగా ఉన్నప్పటికీ వా రంతా ఎంపీటీసీలను వెంటేసుకొని పోలింగ్ కేంద్రాల లోపలికి ప్రవేశించడం కనిపించింది. మరోవైపు ఎ మ్మెల్సీ పోలింగ్ జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీకి చెందిన ప్రచార వాహనాలు పోలింగ్ కేంద్రం ఎదుట నుంచి వెళ్లినా పోలీస్ యంత్రాంగం పట్టించుకోకపోవడం గమనార్హం. చాలా చోట్ల అధికార పార్టీ నేతలకే పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఉపఎన్నిక తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగింది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. పోలీసు యంత్రాంగం కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి ఓటరు ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అన్నీ సక్రమంగా ఉండడంతో లోపలికి ఓటేసేందుకు అనుమతించారు. మరోవైపు పోలింగ్ కేంద్రం సమీపంలోనే అధికార పార్టీ నేతలు తచ్చాడుతున్నా పోలీసు యంత్రాంగం పట్టించుకోకపోవడం గమనార్హం. మహబూబ్నగర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం 245 మందికిగానూ 245 మంది, కొడంగల్లో 56 ఓట్లకుగానూ 56 మంది, వనపర్తిలో 218 ఓట్లకుగానూ 218, కల్వకుర్తిలో 72 ఓట్లకుగానూ 72 మంది, అచ్చంపేటలో 79 ఓట్లకుగానూ 79 మంది, షాద్నగర్లో 171 మందికిగానూ 171, కొల్లాపూర్లో 67 ఓట్లకుగానూ 67, గద్వాలలో 225 ఓట్లకుగానూ 225 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 8 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నారాయణపేటలో 205 ఓటర్లకుగానూ 204 మంది, నాగర్కర్నూల్ పోలింగ్ కేంద్రంలో 101 ఓట్లకుగానూ 100 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో రెండు జిల్లాల్లో మాత్రమే 99 శాతం పోలింగ్ నమోదైంది.
ఎమ్మెల్సీ ఉపఎన్నికలు అధికార పార్టీకి, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్కు పరీక్షగా మారాయి. పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ ఎవరు గెలుస్తారో అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతున్నది. రెండు పార్టీల అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకున్నది. ఎక్కడ జంపుజిలానీలు ఉన్నారో.. చివరి నిమిషంలో ఎవరికి ఓటేశారో తెలియని పరిస్థితి నెలకొన్నది. చాలామంది స్థానిక ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోలేదని, ఆయా పార్టీలను వదిలి ఇతర పార్టీలోకి చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం లేనప్పటికీ జంపు జిలానీలతో పోటీకి దిగింది. కాగా అభ్యర్థిపై ఎమ్మెల్యేలు అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. ఎమ్మెల్యేలు ఓటు వేసి వెళ్లిపోవడం.. ఓటింగ్ సరళి పట్టించుకోకపోవడంతో మిగతా నేతలు ఖంగుతిన్నారు. మొత్తంపైన ఏప్రిల్ 2న జరిగే కౌంటింగ్లో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.
శాసనమండలి ఉపఎన్నికకు అధికారులు కనీవినీ ఎరుగని రీతిలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవినాయక్ ఆధ్వర్యంలో ఇతర జిల్లా కలెక్టర్లు సమన్వయ పర్చుకుని పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద చిన్న సంఘటన నమోదు కాకుండా ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు. మరోవైపు అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. వెబ్ కెమెరాలతో పోలింగ్ సరళిని పరిశీలిస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థులకు, ఓటు వేసే ప్రజాప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. గుంపుగా ఓటు వేయడానికి వచ్చినప్పటికీ వారందరినీ ఒకచోట కూర్చోబెట్టి ఒక్కొక్కరినీ ఓటేయడానికి పంపించారు. ప్రాధాన్య క్రమంలో బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేయడంతో ఒక్కొక్క ప్రజాప్రతినిధికి రెండు మూడు నిమిషాల సమయం పట్టింది. మరోవైపు పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ పత్రాలు.. వాటిపై అభ్యర్థుల ఫొటోలు, పేర్లు కనబడే విధంగా వెలుతురు ఉండేలా చూశారు. మరోవైపు పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ను కంట్రోల్ చేశారు. దీంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరుగుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద అధికార పార్టీ చెందిన కొంతమంది చోటామోట నేతలు హల్చల్ చేశారు. మహబూబ్నగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల ఏజెంట్గా ఉన్న పీసీసీ కార్యదర్శి వినోద్ ఏకంగా ఐడీ కార్డుకు కాంగ్రెస్ పార్టీ గుర్తును పోలివున్న ట్యాగ్ ధరించి తిరగడం కనిపించింది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తుంటే ఆయన వెంటే ఉండటం కూడా విమర్శలకు తావిచ్చింది. మిగతా పోలింగ్ కేంద్రాల్లో కూడా అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడడం స్పష్టంగా కనిపించింది. ఇటు పోలింగ్ సిబ్బంది.. అటు పోలీస్ యంత్రాంగం కూడా వారికి పూర్తి స్థాయిలో సహకరించినట్లు కనిపిస్తోంది. పాసులు ఉండి ఓటర్లను మాత్రమే అనుమతించాల్సిన పరిస్థితుల్లో అధికారపార్టీ నేతలు అందరూ లోపలికి చొచ్చుకువచ్చి కేంద్రాల సమీపంలో దూసుకెళ్లారు. దీంతో బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు.
అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి సీల్ చేసిన బ్యాలెట్ బాక్స్లను గురువారం సాయంత్రం మహబూబ్నగర్కు తరలించారు. సాయుధ పోలీస్ బలగాల బందోబస్తుతో బ్యాలెట్ బాక్స్లు, పోలింగ్ సామగ్రిని పాలమూరులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లకు చేరవేశారు. అనంతరం వాటిని పరిశీలించి స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. ఏప్రిల్ 2న జరిగే కౌంటింగ్లో ఈ బాక్స్లను ఓపెన్ చేస్తారు. రిసెప్షన్ సెంటర్లో బ్యాలెట్ బాక్స్లు, పోలింగ్ సామగ్రిని భద్రపరిచే ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకులు వాణీప్రసాద్, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో స్థానికసంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.