కృష్ణమ్మ ఉప్పొంగుతున్నది.. ఇటీవల కురిసిన వర్షాలతో పరవళ్లు తొక్కుతున్నది. కర్ణాటకతోపాటు ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులకు వరద నమోదవుతున్నది. ఆల్మట్టి డ్యాం నుంచి 75,000 క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 76,000
క్యూసెక్కులు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1.35 లక్షల క్యూసెక్కులు ఉండగా.. 25 గేట్ల నుంచి దిగువకు 1.15 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి 92,511 క్యూసెక్కులు చేరుతున్నది. టీఎస్ పవర్హౌస్లో 4వ
యూనిట్ పవర్గ్రిడ్కు అనుసంధానమై విద్యుదుత్పత్తికి సిద్ధమైంది. ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. కోయిల్సాగర్కు జలకళ సంతరించుకోగా.. ఎత్తిపోతలకు నీటి పంపింగ్ కొనసాగుతున్నది.
– గద్వాల/అయిజ/ శ్రీశైలం, జూలై 29
గద్వాల, జూలై 29 : జూరాలకు వరద కొనసాగుతుండడంతో కృ ష్ణమ్మ పరవళ్లు కొసాగుతున్నాయి. దీంతో జూరాల ప్రాజెక్టు వరద ఉధృతి పెరుగుతున్నది. నారాయణపూర్ డ్యాం నుంచి జూరాలకు 1,35,900 క్యూసెక్కుల నీరు జూరాలకు చేరుతున్నది. దీంతో అ ధికారులు 25గేట్ల ద్వారా దిగువకు 1,15,033 క్యూసెక్కుల వరదను వదులుతున్నారు. 9.657 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 2.832 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తికి 30,072 క్యూసెక్కులు, నెట్టెంపాడ్ లిఫ్ట్కు 750, ఎడమ కాలువకు 640 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాగా మొత్తం అవుట్ ఫ్లో 1,47,232 క్యూసెక్కుల వరద తరలుతున్నది.
అయిజ, జూలై 29 : కర్ణాటకలోని కృష్ణా బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో ఆల్మట్టి గేట్లు ఎత్తి నీటిని నారాయణపుర డ్యాంకు విడుదల చేస్తున్నారు. శనివారం ఆల్మట్టికి ఇన్ఫ్లో 1,37,805 క్యూసెక్కులు ఉం డగా, అవుట్ఫ్లో 75,000 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,705 అడుగులకు గానూ ప్రస్తుతం 1,698.24 అడుగులకు చేరింది. 129.72 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 92.593 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి వరద భారీగా చేరుతుండటంతో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 25 గేట్లు ఎత్తి జూరాలకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 77,500 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 76వేల క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,615 అడుగులకు గానూ 1610.97 అడుగుల నిల్వ ఉంది. 37.640 టీఎంసీలకు గానూ 29.36 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
కర్ణాటకలోని తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. శనివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 68,916 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,473 క్యూసెక్కులుగా నమోదైంది. తుంగభద్ర డ్యాం 105.788 గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 69.473 టీఎంసీల నిల్వ ఉంది. 1633 అడుగులకు గానూ 1622.78 అడుగుల నిల్వ ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాల్వలకు 1,473 క్యూసెక్కులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
కర్ణాటకలోని ఆర్డీఎస్ (రాజోళి బండ డైవర్సన్ స్కీం) ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. శనివారం ఆనకట్టకు 1,585 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 858 క్యూసెక్కులు కన్స్ట్రక్షన్ స్లూయిస్ ద్వారా దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నట్లు ఆర్డీఎస్ ఏఈ రాందాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 7.5 అడుగుల నీటిమట్టం ఉందని పేర్కొన్నారు. వరదతో ఆర్డీఎస్ జలకళను సంతరించుకున్నది.
ఇటిక్యాల, జూలై 29 : ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది. జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో శనివారం బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద ఇటిక్యాల ఎస్సై అశోక్బాబు సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్నారు. వరదను వీక్షించేందుకు పర్యాటకులు ఘాట్కు వచ్చి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
శ్రీశైలం, జూలై 29 : శ్రీశైల జలాశయానికి వరద భారీగా చేరుతున్నది. శనివారం ఉదయం నుంచి జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ద్వారా 1,19,070 క్యూసెక్కులు, పవర్హౌస్ నుంచి 29,805 క్యూసెక్కుల నీరు విడుదల కాగా, సుంకేసుల నుంచి 2,181 క్యూసెక్కుల నీరు రాగా సాయంత్రానికి 92,511 క్యూసెక్కులు శ్రీశైలం రిజర్వాయర్కు రాగా నీటిమట్టం 825.90 అడుగులకు చేరింది. 885 అడుగులకు గానూ ప్రస్తుతం 837.90 అడుగులు, 215 టీఎంసీలకు గానూ 58.81 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం వరకు వరద అధిక మెత్తంలో శ్రీశైల జలాశయానికి చేరుకుంటుందని చెబుతున్నారు.
శ్రీశైలం టీఎస్ జలవిద్యుత్ కేంద్రంలో 4వ యూనిట్ మూడేండ్ల మరమ్మతుల అనంతరం పవర్గ్రిడ్కు అనుసంధానమై విద్యుదుత్పత్తికి సిద్ధమైంది. జెన్కో సీఎండీ నిత్య పర్యవేక్షణలో ఎడమగట్టు జెన్కో అధికారులు సాంకేతిక నిపుణులతో కలిసి మెకానికల్ స్పింజన్, ఎలక్ట్రికల్ స్పింజన్ పనులు పూర్తి చేసుకుని విజయవంతంగా ట్రయిల్ రన్ నిర్వహించారు. అనంతరం యూనిట్ను పూలమాలతో అలంకరించి శాస్ర్తోక్తంగా పూజలు చేసి యానిట్ను పవర్గ్రిడ్కు అనుసంధానం చేశారు. 2020 ఆగస్టు 21 రాత్రి జరిగిన ప్రమాదంలో పేలుడుకు గురై ధ్వంసమైన యూనిట్కు మరమ్మతులు చేసిన జెన్కో అధికారులు ఆరు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వరద 850 అడుగులు దాటితే ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉన్నది. జెన్కో హైడల్ డైరెక్టర్ వెంకటరాజం, చీఫ్ ఇంజినీర్ సూర్యనారాయణ, ఎస్ఈ సద్గుణకుమార్, ఆదినారాయణ, డీఈ జనరల్, ఏడీలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు, సిబ్బంది, ఆర్టిజన్స్ సమిష్టి కృషితో యూనిట్ పున:ప్రారంభమవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
కోయిలకొండ, జూలై 29 : కాకతీయుల కాలంలో ఆలయాల్లో నిర్మించిన కోనేరు, తాగునీటి కోసం బావులను అద్భుతంగా నిర్మించారు. మండలంలోని ప్రఖ్యాతి గాంచిన శ్రీ వీరభద్రస్వామి ఆలయం కూడా ఆ కోవకు చెందిందే.. ఎత్తయిన కొండపై నిర్మించిన కోనేరు గత చరిత్రకు తలమానికంగా నిలిచి నేటి భక్తులకు కనువిందు చేస్తున్నది. దాదాపు కిలోమీటరు ఎత్తులో ఉన్న కొండపై బావిని నాడు అద్భుతంగా తీర్చిదిద్దారు. బండరాయిపై బావిని ఎలా నిర్మించారో అంతుచిక్కని ప్రశ్న.. మూడుకాలల పాటు కొండపై ఉన్న కోనేరులో నీరు ఉంటుంది. వీరభద్రస్వామికి నిత్యం కొండపై ఉన్న కోనేరు నీటితోనే అభిషేకం చేస్తారు. కోనేరు చుట్టూ శివలింగంతోపాటు గణపతి ఇతర విగ్రహాలు ఉన్నాయి. దీంతో పాటు కొండ కింద కూడా తాగునీటికి బావులను సుందరంగా తీర్చిదిద్దారు.
కొండలు, అడవి మధ్య వెలిసిన వీరన్నస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను ఇక్కడి ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి. కొండ రాళ్లతోపాటు చెట్లు, నీరు పారే వాగు, అదేవిధంగా కొండ నుంచి కోయిల్సాగర్ అందాలు కనిపిస్తాయి. భక్తులు రెండ్రోజులు ఇక్కడే ఉండి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. వీరన్న కొండ వద్ద భక్తుల కోసం ఏసీ, నాన్ ఏసీ సత్రాలు సైతం నిర్మించారు. అదేవిధంగా నిర్వహకులు అన్నదాన వసతి ఏర్పాటు చేశారు.
పెద్దమందడి, జూలై 29 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు నిండి అలుగుపారుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు శనివారం చేపల వేటతో సందడిగా గడిపారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేపపిల్లలు పెరిగి పెద్దవడంతో అలుగుల వద్ద ఎదురెక్కుతున్న చేపలను పట్టుకునే పనిలో యువకులు నిమగ్నమయ్యారు. ప్రతి చెరువులో చేపలు కేజీ మొదలుకొని 5, 10, 20 కేజీల వరకు పెరిగాయి.