మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 31 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం ఏడోరోజు మంగళవారం జిల్లాలో విజయవంతంగా కొనసాగింది. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 45కేం ద్రాల్లో కంటి పరీక్షలు చేపట్టారు. 8,408మందికి పరీక్షలు నిర్వహించి 1,081మందికి రీడింగ్ అద్దాలు అందజేశారు. దగ్గర, దూరం చూపు సమస్య ఉన్నవారిని 631 మందిని గుర్తించి వీరికి ప్రత్యేకంగా ఆర్డర్పెట్టి అద్దాలు తయారు చేయిస్తున్నారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటుతోపాటు రెండు బఫర్ టీంలు ఏర్పాటు చేశారు.
జడ్చర్లలో..
జడ్చర్లటౌన్, జనవరి 31: మున్సిపాలిటీలోని 3వ, 15వ వార్డులో ఏర్పాటు చేసిన కంటి పరీక్ష శిబిరాల్లో 468 మందికి పరీక్షలు నిర్వహించగా, 63మందికి అద్దాలు అందజేశారు. మరో 42మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ శివకాంత్ తెలిపారు. గంగాపూర్ పీహెచ్సీ పరిధిలోని గంగాపూర్, చిన్న ఆదిరాలలో శిబిరాలను నిర్వహిస్తున్నారు. గంగాపూర్లో 85మందికి పరీక్షలు నిర్వహించగా, 13మందికి అద్దాలు పంపిణీ చేశారు. మరో 12 మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. చిన్నఆదిరాలలో 109మందికి పరీక్షలు నిర్వహించగా, 16మందికి అద్దాలు పంపిణీ చేశారు. మరో 14మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ సమత తెలిపారు.
సద్వినియోగం చేసుకోవాలి
దేవరకద్ర, జనవరి 31: కంటివెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి టైటస్పాల్ అన్నారు. మంగళవారం చౌదర్పల్లి, దేవరకద్రలో కార్యక్రమాన్ని పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, డాక్టర్ శరత్చంద్ర పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, జనవరి 31: ‘కంటివెలుగు’ కార్యక్రమం పేదలకు వరమని సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని పీహెచ్సీలో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాన్ని పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో తాసిల్దార్ రాంబాయి, డాక్టర్ మధుసూదన్రావు, కంటివెలుగు కోఆర్డినేటర్ శ్రీనివాసులు, డాక్టర్ మౌనిక, డాక్టర్ రవికుమార్, డాక్టర్ ఉత్తరయ్య, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలంలో..
దేవరకద్ర రూరల్, జనవరి 31: రెండో విడుత ‘కంటివెలుగు’ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కౌకుంట్ల తాసిల్దార్ శివరాజు అన్నారు. మంగళవారం అప్పంపల్లిలో తాసిల్దార్ కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అలాగే చిన్నచింతకుంట మండలకేంద్రంలో కంటి వైద్య శిబిరం కొనసాగుతున్నది. రేకులంపల్లిలో 160మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 30మందికి కంటి అద్దాలు పంపిణీ చేసి, మరో 9మందికి ఆర్డర్ ఇచ్చినట్లు వైద్యులు తె లిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు స్వామి, సువర్ణ, ఎంపీటీసీ మనోహర్రెడ్డి, కార్యదర్శులు సునీత, సాయిమమత, డాక్టర్ సనా, సంతోష్, షఫీ ఖ్, రాధిక, రాహుల్, శిబిరం కోఆర్డినేటర్ రాజన్న, కంటివైద్య నిపుణుడు ఖాదర్, సూపర్వైజర్ సుశీల పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, జనవరి 31: మండలకేంద్రంతోపాటు పల్లెగడ్డ, కొల్లూరు గ్రామాల్లో కంటివెలుగు కార్యక్రమంల కొనసాగుతున్నది. మంగళవారం నవాబ్పేటలో 256మందికి కంటి పరీక్షలు నిర్వహించి, ఐదుగురికి కంటి అద్దాలు అందజేశారు. 16మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. పల్లెగడ్డలో 158మందికి, కొల్లూరులో 252 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి విజయలక్ష్మి, వైద్యసిబ్బంది బీచుపల్లిగౌడ్, శ్రీనివాస్, శకుంతల, శరబలింగం, అవినాష్ పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, జనవరి 31: కంటివెలుగును ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని ఎంపీడీవో సాయిలక్ష్మి అన్నారు. మంగళవారం మండలకేంద్రంతోపాటు కొత్తపల్లిలో కంటివెలుగు పరీక్షలు నిర్వహించారు. 326మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 47మందికి అద్దాలు అందజేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు మనుప్రియ, కృష్ణకుమార్, ఎంపీవో అనురాధ, కొత్తపల్లి సర్పంచ్ దేవెందర్, వైద్య సిబ్బంది దేవయ్య, జంగయ్య తదితరులు ఉన్నారు.
బాలానగర్ మండలంలో
బాలానగర్, జనవరి 31 : కంటివెలుగు కార్యక్రమం మంగళవారం మండలంలో కొనసాగింది. మండలకేంద్రంలో 277మందికి కంటి పరీక్షలు నిర్వహించి 20మందికి కంటి అద్దాలు అందజేశారు. 31మందికి అర్డర్ పెట్టినట్లు డాక్టర్ సృజన తెలిపారు. అలాగే చిన్నరేవల్లిలో 112మందికి కంటి పరీక్షలు నిర్వహించి నలుగురికి కంటి అద్దాలు అందజేసి తొమ్మిది మందికి అర్డర్ పెట్టినట్లు తెలిపారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, జనవరి 31: ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేస్తున్న కంటివెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూపని కళావతికొండయ్య సూచించారు. మూసాపేట రైతు వేదికలో మంగళవారం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీవో సరోజ, ఏవో రాజేందర్రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు భాస్కర్గౌడ్, అబ్దుల్ జమీర్, తాజోద్దీన్, కొండయ్య, శేఖర్, తిరుపతయ్య, బాలరాజు, మహేందర్, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.