రాజోళి, నవంబర్ 10 : పదేండ్ల కిందట తాగునీటి కోసం కంటిమీద కునుకులేకుండా రాత్రింబవళ్లు నల్లాల వద్ద బిందెలు పెట్టి పడిగాపులు కాసిన రోజులెన్నో.. మహిళలు బిందెలు తీసుకొని వ్యవసాయ పొలాలు, చెలిమెల వద్ద గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల కొలది పరుగులు పెట్టిన కష్టాలకు తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్ భగీరథ’తో పరిష్కారం చూపింది. దశాబ్దాలపాటు తాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఇంటి పక్క వారితో పబ్లిక్ కొలాయిల వద్ద గొడవలు, పనులను వదులుకొని పడిగాపులు కాసిన రోజులెన్నో ఉన్నాయి. ఎండుతున్న గొంతులను తడుపుకునేందుకు మహిళలు కిలోమీటర్ల దూరం నడుస్తూ వెళ్లి వ్యవసాయ బావులు, బోర్ల వద్ద నీటిని తెచ్చేందుకు అవస్థలు పడ్డ జనం నేడు మండు వేసవిలోనూ ఇంటి ముంగిటే స్వచ్ఛమైన తాగునీరు వస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజోళి మండలంలోని గ్రామాల ప్రజలు తుంగభద్ర నదీ తీరంలో ఉన్నప్పటికీ ఏనాడూ తాగునీరు ప్రజలకు అందించిన పాలకులు లేరు. మండలంలోని గ్రామాలకు వచ్చి చుట్టాలు నది పక్కన ఉన్నా తాగునీరు లేదా అంటూ అశ్చర్యంగా చూసేవారు. గ్రామాల్లో అక్కడక్కడా పబ్లిక్ కోలాయిలు ఉన్నా రెండు, మూడు రోజులకు ఒక్కసారి వదులుతూ తాగునీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రజలకు తాగునీటి కష్టాలను తీర్చేందుకు ‘మిషన్ భగీరథ’ పథకాన్ని తీసుకొచ్చారు. ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటు చేసి నట్టింట్లో స్వచ్ఛమైన తాగునీరు అందించారు. ఏండ్లుగా పడిన కష్టాలను తీర్చడంతో మహిళలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ముఖ్య ఉద్దేశం భూగర్భజలాలను అతి తక్కువగా వాడుతూ, నమ్మదగిన ఉపరితల నీటిని శుద్ధిచేస్తూ ప్రతి ఇంటికీ ప్రతి రోజూ తాగునీరు అందించడమే. గ్రామాల్లో అధిక ఫ్లోరైడ్తో చిన్నారులు, పెద్దలు అనేక విషపూరితమైన వ్యాధులతో అనారోగ్యం పాలవుతున్న వారికి మంచినీటిని అందిస్తూ శాశ్వత పరిష్కారం దిశగా ఈ పథకం ప్రారంభించారు. 2016 ఆగస్టు 7న ప్రారంభించి, 2019 నాటికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటు చేసి సురక్షిత మంచినీటిని అందిస్తున్నారు.
పదేండ్ల కిందట తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి బిందెల్లో తాగునీళ్లు తెచ్చుకునేటోళ్లం. వీధుల్లో వచ్చే కుళాయిలు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు రావో తెలియని పరిస్థితి. రాత్రింబవళ్లు నీళ్ల కోసం పడిగాపులు కాసేటోళ్లం. వీధిలో మొత్తం బిందెలను లైనులో పెట్టి వచ్చే రెండు బిందెల నీళ్లకు రోజంతా ఇతర పనులు మానుకొని ఉండేటోళ్లం. ఇన్ని కష్టాలను దూరం చేస్తూ సీఎం కేసీఆర్ నేడు నట్టింటికి మంచినీరు తీసుకొచ్చిండ్రు. కేసీఆర్ సారు సల్లగుండాలె.
ఏండ్ల నుంచి పడిన కష్టాలను సీఎం కేసీఆర్ సారు తన గొప్ప మనస్సుతో తీర్చారు. గతంలో కొలాయి వద్ద బిందె పెట్టి గంటల తరబడి ఎండనక, వాననకా క్యూలైన్లలో ఉండి నీళ్లు పట్టుకునేటోళ్లం. పనులన్నీ మానుకొని ఇంట్లో ఒక మనిషి నీళ్లు పట్టనీకనే ఉంటుండె. ఇట్లాంటి పరిస్థితుల నుంచి కేసీఆర్ సారు మమ్మల్ని గట్టెక్కించిండు. నట్టింటికి నీళ్లు తీసుకొచ్చి మహిళల పాలిట దేవుడిలా మారిండు. అందరికీ మంచి చేస్తున్న సీఎం కేసీఆర్కే మా మద్దతు.
* అలంపూర్లో రూ.8కోట్ల 93లక్షలు ఖర్చు చేస్తూ 97.73 కిలోమీటర్లు 40 ట్యాంకుల నిర్మాణంతో 10,538 నల్లాలను ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు.
* అయిజలో రూ.16కోట్ల 36లక్షలు ఖర్చు చేస్తూ 146.7 కిలోమీటర్లు, 63 ట్యాంకుల నిర్మాణంతో 15,306 నల్లాల ఏర్పాటుతో తాగునీరు అందిస్తున్నారు.
* ఇటిక్యాలలో రూ.16కోట్ల 77లక్షలు ఖర్చు చేస్తూ 157.6 కిలోమీటర్లు, 77 ట్యాంకుల నిర్మాణంతో 13,737 నల్లాలను ఏర్పాటు చేశారు.
* మానవపాడులో రూ.9కోట్ల 63లక్షలు ఖర్చు చేస్తూ 82.7 కిలోమీటర్లు, 41 ట్యాంకుల నిర్మాణంతో 7,673 నల్లాలను ఏర్పాటు చేశారు.
* రాజోళిలో రూ.10కోట్ల 13లక్షలు ఖర్చు చేస్తూ 98.5 కిలోమీటర్లు, 38ట్యాంకుల నిర్మాణంతో 8,638 నల్లాలను ఏర్పాటు చేశారు.
* ఉండవల్లిలో రూ.11కోట్ల 12లక్షలు ఖర్చు చేస్తూ 90.73 కిలోమీటర్లు, 36 ట్యాంకుల నిర్మాణంతో 9,426 నల్లాలను ఏర్పాటు చేశారు.
* వడ్డేపల్లిలో రూ.9కోట్ల 96లక్షలు ఖర్చు చేస్తూ 86.56 కిలోమీటర్లు, 35 ట్యాంకుల నిర్మాణంతో 8,487 నల్లాలను ఏర్పాటు చేశారు.
* నియోజకవర్గంలో రూ.82కోట్ల 93లక్షలతో 330 ట్యాంకులను 760.94 కిలోమీటర్ల పైపులైన్ ఏర్పాటు చేసి 73,805 నల్లాలతో శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందిస్తున్నారు.