తెల్లబంగారానికి వన్నె తగ్గింది. బాదేపల్లి పత్తి మార్కెట్లో క్వింటాకు గరిష్ఠంగా రూ.6,918 ధర మాత్రమే పలుకుతున్నది. వానకాలం సీజన్ ప్రారంభంలో క్వింటాకు రూ.7,295 వరకు ధర లభించినా.. ఆ తర్వాత రోజురోజుకూ ధరలు తగ్గుతూ వచ్చాయి. సుమారుగా రూ.6 వేల నుంచి రూ.6,500 వరకే మార్కెట్ ధర లభిస్తున్నది. కనీసం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.7,020 కూడా రైతులకు దక్కడం లేదు. గతేడాది క్వింటాకు రూ.9,049 రేట్ లభించగా.. ఈ ఏడాది రూ.10 వేల వరకు వస్తుందనుకున్నా నిరాశే ఎదురైంది. దీంతో కనీస మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. ఇప్పటికే ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం.. ఆశించిన మేరకు దిగుబడి రాక.. ప్రస్తుతం ధరలు అంతంతే ఉండడంతో పెట్టుబడి పైసలు సైతం రాని పరిస్థితిలో కర్షకులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వంమద్దతు ధర పెంచాలని కోరుతున్నారు.
జడ్చర్ల, డిసెంబర్ 11 : గతేడాది కంటే పత్తికి ధరలు పూర్తిగా పడిపోయాయి. గతేడాది వానకాలం సీజన్ ప్రారంభంలో పత్తి క్వింటా ధర రూ. 9వేలకు పైగా పలుకగా ఈ ఏడాది వానకాలం సీజన్ నవంబర్ ప్రారంభంలో క్వింటా రూ.7,295ధర పలికింది. ఆ తర్వాత రోజురోజుకు ధరలు పడిపోతున్నాయి. సుమారుగా పత్తికి క్వింటా రూ.6వేల నుంచి రూ.6,500 వరకు ధరలు పలుకుతున్నాయి. కనీసం ప్రభుత్వం మద్దతు ధర రూ.7,020 కూడా రైతులకు దక్కడం లేదు. ఇలాంటి సమయాల్లో రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయడానికి కనీసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేసినైట్లెతే వ్యాపారులు కూడా ధరలు పెంచే అవకాశం ఉండేది. కానీ ఈ ఏడాది ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానకాలం ప్రారంభంలో వర్షాలు అధికంగా కురవడంతో మొలకెత్తిన మొలకలు ఎర్రబారగా ఎదుగుతున్న సమయంలో వర్షాభావం వెంటాడింది. దాంతో పత్తి పైర్లు ఎదగలేక పోయాయి. పైర్లు అంతగా పెరగకపోవడంతో పూత, కాయ తక్కువగా వచ్చింది. పెట్టుబడులు అధికంగా పెట్టినా దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చిందని, ఖర్చులు ఎక్కువయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికి ధరలు మంచిగా ఉంటే కొంతవరకైనా అప్పులు తీర్చుకుందామంటే మార్కెట్లో ధరలు పూర్తిగా తగ్గిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. అతివృష్టి, అనావృష్టిలకు తోడు తెగుళ్లు అధికమై పంటచేలు పాడైపోయాయి. వ్యవసాయం మీద ఆధారపడిన రైతులకు పంటల ఉత్పత్తుల ధరలు చూస్తే కన్నీళ్లే మిగులుతున్నాయి. గతేడాది పత్తి పంటలు దెబ్బతినడం వల్ల ఈసారి మంచి ధరలు వస్తాయని అ ధిక మొత్తంలో పత్తిని సాగుచేయడం చేశా రు. కానీ వరుణుడు క రుణించక ప్రారంభం లో ఆలస్యంగా పంటలను సాగుచేశారు. ఆ తర్వాత అధిక వర్షా లు రైతులను నిండా ముంచాయి. రెండుసార్లు విత్తనాలు నాటాల్సిన పరిస్థితి నెలకొన్నది. వర్షాలు సమయానికి కురిస్తే పంటలు బాగా పండుతాయని అనుకున్న రైతులకు వరుణుడు కరుణించకపోవడంతో ఫైర్ల ఎదుగుదల తగ్గింది. దాంతో దిగుబడు లు కూడా బాగా తగ్గాయి. కనీస ధరలు రూ. 10వేల వరకు క్వింటా పలుకుతుందని భావించిన రైతులకు ధరలు తగ్గడంతో వారిలో ఆందోళన మొదలైంది. సాధారణంగా పత్తి ఎకరాకు 10నుంచి15వేలు క్వింటాలు దిగుబడి వస్తుం ది. కానీ వర్షాభావ పరిస్థితులతో పంటలు దెబ్బతినడంతో ఎకరాకు 3నుంచి 5క్వింటాళ్ల మాత్రమే దిగుబడి వచ్చింది. దిగుబడికి తగ్గట్టుగా ధరలు అధికంగా ఉంటే మంచి ధరలు లభించడంతో రైతులకు మంచి లాభం చేకూరేది. కానీ ధరలు పడిపోవడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు.
పత్తి ధరలను చూస్తే ఈ సారి పంటల సాగుకు పెట్టిన ఖర్చులు కూడా వచ్చే అవకాశం కన్పించడం లేదు. పత్తికి ధరలు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఎంతో వ్యయప్రయాసకోర్చి పంటలను సాగుచేస్తే చేతికందిన తర్వాత ధరలు లేకపోవడం వలన అప్పులపాలు కావాల్సి వస్తోంది. గతేడాది క్వింటాకు రూ.9వేలకు పైగానే ధర పలికింది. ఈ సారి కూడా పత్తి ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో రైతులు పత్తిని అధికంగా సాగుచేశారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న ధరలను చూస్తే భయమేస్తుంది. వానకాలంలో సాగుచేసిన పత్తిపంట అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్నది. ఎకరాకు మూడు నుంచి 5క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. ఇలా అయితే వ్యవసాయం చేయడం ఇబ్బందే. కనీసం పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. శనివారం మార్కెట్కు పత్తిని తీసుకొస్తే రూ.6,918ధర వచ్చింది. ఇలా అయితే అప్పులు ఎలాతీర్చాలో తెలియని పరిస్థితి. కనీసం రూ.10వేల నుంచి రూ.12వేలు ధర వస్తే బాగుండేది.
సాగుకు ఖర్చులే మో రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక ఎకరాలో పత్తిని సాగుచేయాలంటే రూ.30వేలకు పైగా ఖర్చు వస్తుంది. ది గుబడులు మా త్రం 5 క్వింటాళ వరకు వస్తుంది. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. గతేడాది పంటలు దెబ్బతినడంతో చాలా నష్టం వచ్చింది. ఈసారైనా పత్తి పంటకు మంచి ధరలు వస్తాయని సాగుచేస్తే ఈసారి గతేడాది కంటే తక్కువ ధరలు వస్తున్నాయి. వ్యవసాయాన్ని మానేసి ఇతరపనులకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరలు కూడా రావడంలేదు. ఇక నుంచైనా ప్రభుత్వం రైతులను దృష్టిలో ఉంచుకొని మద్దతు ధరను పెంచితే రైతులకు గిట్టుబాటవుతుంది. మార్కెట్లో ధరలేక పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ గిట్టుబాటు ధరలు తగ్గుతుండటంతో వ్యాపారులు కూడా ధరలను తగ్గిస్తూ కొనుగోలు చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం మద్దతు ధరలను పెంచాల్సిన అవసరం ఉంది. పత్తికి క్వింటాకు రూ.12వేలకుపైగా ధరలు పెంచితేనే రైతులకు గిట్టుబాటవుతుంది. శనివారం బాదేపల్లి మార్కెట్కు పత్తిని తీసుకొస్తే క్వింటా రూ. 6,909ధర వచ్చింది. ధర ఇంత తక్కువగా వస్తే వ్యవసాయం చేసి దండగ.