గద్వాల, ఫిబ్రవరి 26 : వానకాలం పంట కన్నీళ్లను మిగల్చగా కోటి ఆశలతో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్న ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలోని రిజర్వాయర్, చెరువుల్లో నీరు లేక పోవడంతో భూగర్భజలాలు తగ్గాయి. దీంతో బోరుబావుల్లో నీటి లభ్యత మందగించడంతో అన్నదాతకు ఏమి చేయాల్లో పాలుపోవడం లేదు. ఈ ఏడాది జూరాల, ఆర్డీఎస్, తుమ్మిళ్ల లిఫ్ట్ కింద రిజర్వాయర్లో నీరు లేని కారణంగా అధికారులు క్రా ప్ హాలిడే ప్రకటించారు. బోర్ల కింద అయినా పంటలు సాగు చేసుకుందామంటే నీటి లభ్యత తగ్గడంతో రైతు లు యాసంగికి అనుకున్న స్థాయిలో సిద్ధం కాలేదు. 2020 నుంచి 2022-2023 వరకు ప్రతి ఏడాది జిల్లాలో యాసంగి సాగు పెరుగుతూ వచ్చింది. కాగా ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం తగ్గడంతో సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. వానకాలంలో జూరాలకు వరదలు వచ్చిన సమయంలో అధికారులు రిజర్వాయర్లు, చెరువులు నింపి ఉంటే ఈ ఏడాది యాసంగి సాగు విస్తీర్ణం పెరిగేది. అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేయడంతో ప్రస్తుతం రిజర్వాయర్లలో నీటి నిల్వలు నిండుకున్నాయి.
జూరాల ప్రాజెక్టులో మిషన్ భగీరథకు సరిపడా నీళ్లు ఉండగా నెట్టెంపాడ్ ప్రాజెక్టు కింద కేవలం ఐదువేల ఎకరాలకు మాత్రమే నీరు అందించే అవకా శం ఉందని అధికారులు ప్రతిపాదించారు. గత ప్రభు త్వం రైతుల సంక్షేమానికి వినూత్న పథకాలు, సాగునీటిని అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నుంచి చెరువులకు నీటి విడుదలతో గతంలో సాగు పెరిగింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం లో వ్యవసాయాన్ని పండుగలా చేసుకునేందుకు అన్ని సదుపాయాలు కల్పించడంతో రైతులు వ్యవసాయంపై మొగ్గు చూపారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులను గాలికొదిలేయడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో యాసంగి మొదలు కాగానే ఖాతాల్లో రైతుబంధు జమ అయ్యేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో యాసంగి సాగుకు అన్నదాతలు మొగ్గు చూపడం లేదు.
జిల్లాలో 2020-21లో 1,00,387 ఎకరాల్లో.. 2021-22లో 1,03,773 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. 2022-23 యాసంగిలో రైతులు 1, 38,378 ఎకరాల్లో పంటలు సాగు చేయగా ఈ ఏడాది యాసంగిలో 1,07,075 ఎకరాల్లో సాగు చేశారు. గత యాసంగితో పోల్చితే ఈసారి 31,303 ఎకరాలు తక్కువగా సాగు చేశారు.