జడ్చర్ల, మార్చి 16 : జడ్చర్ల మండలంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షంతో ఎండల వేడిమి నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించినైట్లెంది. అదేవిధంగా ఆరుతడి పంటలకు ఈ వర్షం కొంత మేలుచేసింది. సాయంత్రం కురిసిన వర్షానికి బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆరుబయట ఉన్న వేరుశనగ బస్తాలు తడిశాయి. అయితే టెండర్లు పూర్తయి తూకాలు జరిగాక వర్షం కురవడంతో ఎలాంటి నష్టం జరగలేదు.
మూసాపేటలో భారీ వర్షం
మూసాపేట(అడ్డాకుల), మార్చి 16 : మూసాపేట, అడ్డాకుల మండలంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. తుఫాన్ కారణంగా సాయంత్రం వరకు ఎండ ఎక్కువగా ఉంది. బలమైన ఈదురుగాలులు వీస్తూ వర్షం మొదలైంది. ఈదురుగాలులకు మామిడి తోటలలో మామిడి కాటలు మొత్తం రాలిపోయి తీవ్ర నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు.
వడగండ్ల వాన
మక్తల్ టౌన్, మార్చి 16: వాతావరణ మార్పులో భాగంగా గురువారం సాయంత్రం మక్తల్ మండలంలోని పారేవుల, ముస్లాయపల్లిలో తేలికపాటి వడగండ్ల వాన కురిసింది. పలు గ్రామాల్లో చిరుజల్లులు కురిశాయి.