గ్రామాలు, పట్టణాల్లో కొనసాగుతున్న మినీ లాక్డౌన్
అమలు చేస్తున్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు
స్వచ్ఛందంగా నిబంధనలు పాటిస్తున్న ప్రజలు
పరకాల/శాయంపేట/గీసుగొండ/రాయపర్తి, మే 8: జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు అమలు చేస్తుండగా, ప్రజలు స్వచ్ఛందంగా నిబంధనలు పాటిస్తున్నారు. పరకాల పట్టణంలో మున్సిపల్ అధికారులు, పోలీసుల సూచన మేరకు వ్యాపార, వాణి జ్య వర్గాలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటున్నాయి. ఒంటిగంట తర్వాత పట్టణంలో దాదాపు అన్ని దుకాణాలు మూసి ఉంటున్నాయి. శాయంపేట మండలంలోని శాయంపేట, పత్తిపాకలో సెల్ఫ్ లాక్డౌన్ కొనసాగుతున్నది. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకుల కొనుగోలుకు అవకాశం కల్పించారు. అనంతరం వ్యాపార, వాణిజ్య దుకాణాలు, హోటళ్లు మూసివేస్తున్నారు. గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి, గంగదేవిపల్లితోపాటు గ్రేటర్ వరంగల్ పరిధిలోని ధర్మారం, మొగిలిచర్లలో కరోనా కేసులు పెరుగుతున్నందున గ్రామస్తులు పాక్షిక లౌక్డౌన్ విధించుకున్నారు. గ్రామంలో మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న వారికి జరిమానా విధిస్తున్నారు.
స్వచ్ఛంద లాక్డౌన్కు తీర్మానం
రాయపర్తి: మండలంలోని కొత్తూరు, పానీష్తండాలో ఆదివారం నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ అమలుకు గ్రామసభలో తీర్మానించినట్లు సర్పంచ్లు కందికట్ల స్వామి, భూక్యా వెంకట్రాంనాయక్, కార్యదర్శులు గంగారపు సుమన్, భూక్యా మహేందర్నాయక్ తెలిపారు. మండలకేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న తరుణంలో గ్రామ పంచాయతీల పాలకవర్గాలు ప్రజల అభిప్రాయం తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు. దుకాణాలు ఉదయం 10 గంటల వరకే నిర్వహించుకోవాలని సూచించారు. సమావేశాల్లో ఉప సర్పంచ్లు అంబటి రమాదేవి, కారోబార్లు కందికట్ల సురేశ్, బాలాజీనాయక్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: మండలంలోని తిరుమలగిరి, ఆత్మకూరు, పెద్దాపురంలో స్వచ్ఛందంగా సంపూర్ణ లాక్డౌన్ కోసం జీపీలు తీర్మానం చేసుకున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు పది రోజులపాటు లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు కోసం సడలింపు ఉంటుందని సర్పంచ్లు తెలిపారు. వ్యాపారులు, ప్రజలు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని సర్పంచ్ పర్వతగిరి రాజు హెచ్చరించారు.