హైదరాబాద్ : కొవిడ్-19తో మరణించిన ఓ వృద్ధురాలి బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని గచ్చిబౌలిలో చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. అత్తాపూర్కు చెందిన వృద్ధ దంపతులు కొవిడ్ పాజిటివ్తో ఏప్రిల్ 9న గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో చేరారు. కోలుకున్న అనంతరం భర్త డిశ్చార్జీ కాగా భార్య చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 18న మృతిచెందింది. ఆస్పత్రి వర్గాల సమాచారంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు వచ్చారు.
అయితే వృద్ధురాలి 4 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. సిబ్బంది, మేనేజ్మెంట్ నుండి అస్పష్టమైన సమాధానాలు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా రోగిపై ఎటువంటి విలువైన వస్తువులు లేవని కుటుంబ సభ్యుల నుండి ఆస్పత్రి వర్గాలు అండర్టేకింగ్ తీసుకున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.