నాగర్కర్నూల్, జూలై 3 : విద్యుత్ అధికారుల దౌర్జన్యానికి ఓ రైతు తన పొలం లో 20 ఏళ్లుగా పెంచుకుంటున్న టేకుచెట్లు నేలమట్టం చేసిన ఘటన నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామ శివారులో చోటు చేసుకున్నది. విద్యుత్ అధికారులు టేకు చెట్లను నేలమట్టం చేసిన తీరును చూసిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండబెట్ల గ్రామానికి చెందిన శేవకుల గాడి బుచ్చన్న 46 ఇ సర్వే నెంబర్లోని తన వ్యవసాయ పొలం గెట్టు మీదుగా 20 ఏళ్ల కిందట టేకు మొక్కలను నాటుకున్నాడు. అప్పటి నుంచి నీళ్లకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పోతనీటితో వాటిని పెంచి పెద్ద చేశాడు. గతంలో పొలాల మీదుగా ఉన్న విద్యుత్ లైన్ను ఐదేండ్ల కిందట బుచ్చన్న టేకు చెట్లు నాటిన గెట్టుమీదుగా ఏర్పాటు చేశారు.
అప్పట్లో సర్దుకుపోయిన సదరు రైతు ప్రతి ఏడాది వైర్లకు తాకకుండా కొమ్మలను మాత్రమే కొట్టి వేయించేవాడు. అయితే తీగలకు తాకుతున్నాయన్న కారణం చూపి ట్రీకటింగ్ పేరుతో ఎల్సీ తీసుకొని విద్యుత్ అధికారులు, ముందు పొలాల రైతులు కుమ్మకై తీగలకు తగులుతున్న కొమ్మలను కొట్టాల్సి ఉండగా, సదరు రైతుకు సమాచారం కానీ, నోటీసు కానీ ఇవ్వకుండా గత బుధవారం ఏకంగా జేసీబీతో 16 టేకు చెట్లను నేలకూల్చారు. ఈ విషయంలో విద్యుత్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ముందు పొలాల రైతులకు సహకారంతో చెట్లను కూల్చివేశారు. ఈ విష యం తెలుసుకున్న సదరు రైతు బుచ్చన్న అతని భార్య ప్రభావతమ్మ శుక్రవారం పొలం వద్దకు వెళ్లి నేలకూలిన టేకు చెట్ల ను చూసి కన్నీరు మున్నీరుగా విలపించా రు.
నాటిన రోజుల్లో నీళ్లకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పోతనీటితో పెంచి పెద్ద చేశామని, ఇంత పెద్ద చెట్లను ఎందుకు పనికిరాకుండా చేశారని, విద్యుత్ లైన్లో ఎల్సీ ఇచ్చిన సమయంలో అక్కడే ఉండి చూసుకోవాల్సిన అధికారులు పత్తా లేకుండా పోవడంతో ఇష్టానుసారంగా చెట్లను కూలదోశారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై విద్యుత్ అధికారులను సంప్రదించగా తమకు ఎలాంటి సంబంధం లేద ని తప్పించుకుంటున్నారని, ఈ విషయ మై ఫారెస్టు అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సదరు రైతు తెలిపారు. రైతుకు జరిగిన నష్టంపై పూర్తి విచారణ జరిపించాలని, చెట్లను తొలగించవద్దనే నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకొని, తనకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.