నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ), జూన్ 6 : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని నాగర్ర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమం అమలు కావాలంటే కేసీఆర్తోనే సాధ్యమన్నారు. తెలంగా ణ మోడల్ చూసి ఇతర రాష్ర్టాల ప్రజలు బ్ర హ్మరథం పడుతున్నారని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులతో దేశానికి సీఎం కేసీఆర్ సే వలు ఎంతో అవసరమని వెల్లడించారు.
బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయం – ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రజలకు మంచి చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని.. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. అభివృద్ధిని సహించని కొందరు దుర్మార్గులు కుట్రలు పన్ని తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రజలకు చేసిన మంచే పద్నాలుగు స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతున్నదని జోష్యం చెప్పారు. అచ్చంపేట పచ్చబడే సందర్భం ఆసన్నమైందని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఎవరికీ భయపడేది లేదని, ప్రజలు మా వెంట ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పడిందని, రూ.35వేల కోట్లతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించగా.. కొందరు అభివృద్ధి నిరోధకులు చనిపోయిన వాళ్ల పేర్లతో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ధృడసంకల్పంతో పీఆర్ఎల్ఐ పథకాన్ని పూర్తి చేయిస్తున్నారన్నారు. అచ్చంపేటలో నిరంజన్ షావలీ, ఉమామహేశ్వర, చెన్నకేశవస్వామి, మద్దిమడుగు ఆంజనేయస్వామి రిజర్వాయర్లతో 5టీఎంసీల రిజర్వాయర్, 85వేల ఎకరాలకు ఆయకట్టు ఇచ్చేలా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పాలన అనుమతులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంను విమర్శిస్తే ఖబడ్దార్ ; ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
చిల్లర రాజకీయాల కోసం సీఎం కేసీఆర్ను విమర్శిస్తే సహించేది లేదని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి హెచ్చరించారు. ఒకాయన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని మరిచి అధికారం కోసం పగటి కలలు కంటున్నారని.. చేతనైనా అభివృద్ధిపై కొల్లాపూర్లో చర్చకు రావాలని జూపల్లి కృష్ణారావును ఉద్దేశించి అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టి సీఎంను విమర్శించడం సహించరానిదన్నారు. చిల్లర రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడతామంటే చూస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. కందనూలుకు ఎన్నడైనా మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు వస్తదని కల గన్నామా.. ప్రజల దరికి పాలనను తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.
రైతు బిడ్డ సీఎం కావడం అదృష్టం; ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
రైతు కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కావడం మన అదృష్టమని.. సీఎం కేసీఆర్ జిల్లాకు రావడం మనందరి అదృష్టమని.. స్వాగతం పలికేందుకు లక్షలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ కుటుంబీకులు, రైతులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తెలంగాణ కోటి రతనాల వీణలా 1.25కోట్ల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు పాటుపడుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు వలసలు, కూలీలకు నిలయమని.. లక్షల మంది వలసపోయి కుటుంబాలు దుర్భరస్థితిలో ఉండేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 22లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా రూ.వేల కోట్లు మంజూరు చేసి పాలమూరును సస్యశ్యామలం చేశారని కొనియాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సీమాంధ్రా వాళ్లతో కుమ్ముక్కై ఎన్జీటీ స్టే తీసుకొస్తే జాప్యమైందని, సీఎం కేసీఆర్ చొరవతో స్టే తొలగిపోయిందన్నారు. 12.50లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
సీఎం కేసీఆర్కి కృతజ్ఞతలు ; జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి
ప్రాజెక్టులను పూర్తి చేసి రైతన్న కష్టాలను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని నాగర్కర్నూల్ జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా మహిళలకు తాగునీటి కష్టాలను శాశ్వతంగా తీర్చారని తెలిపారు. రక్తహీనతతో బాధపడే మహిళల కోసం న్యూట్రీషన్ కిట్లాంటి పథకాలు తీసుకువచ్చారన్నారు. సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని అన్నారు.
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ నాగర్కర్నూల్ పర్యటన సందర్భంగా లక్షలాది మంది జనం తరలివచ్చారు. తొమ్మిదేండ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధిని హర్షిస్తూ సీఎం కేసీఆర్కు జేజేలు పలికారు. ఒకప్పుడు వలసలకు నిలయంగా మారిన జిల్లాను సాగునీటితో సస్యశ్యామలం చేసి మా బతుకులు బాగు చేసిండని కొనియాడారు.
మా బతుకులు మారినయ్..
సీఎం కేసీఆర్ సారు వొచ్చినంక మా బతుకులు బాగుపడ్డయి.. దేశాలు పట్టుకొని వలసలు పోయేటోళ్లం. తెలంగాణ రాష్ట్రం వొచ్చినంక కాల్వల వెంట నీళ్లొచ్చియి. రైతుబంధు, రైతుబీమాతో రైతులకు దేవుడిలా మారిండు. ఇప్పుడు పట్నం నుంచి ఇంటికొచ్చి ఇక్కడే మంచిగ వ్యవసాయం చేసుకుంటున్నాం. సీఎం సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం.
-లక్ష్మమ్మ, పెరుమాండ్లపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గం
మా పెద్దకొడుకు కేసీఆర్..
సీఎం కేసీఆర్ సారూ.. మా పెద్దకొడుకు లెక్క. ఈ కాలంలో సొంత కొడుకులే పట్టించుకుంట లేరు. అట్లాంటిది కొట్లాడి తెలంగాణ సాధించి.. మా బతుకులు మార్చిండు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు అన్ని సౌలత్లు కల్పించిండు. లేనోళ్లకు ఇండ్లు కూడా ఇస్తున్నడు. తొమ్మిదేండ్లలో చానా మారింది. వ్యవసాయం పండుగలా మార్చిండు.
– లింగన్నగౌడ్, అవురాశిపల్లి, నాగర్కర్నూల్ మండలం
చెప్పిండంటే చేసి చూపిస్తడు..
కేసీఆర్ అంటే మాకు నమ్మకం. ఏదైనా చెప్పిండంటే చేసి చూపిస్తడు. మంచి పాలన అందిస్తుండు. రైతుకు దేవుని లెక్క. కంట్రోల్లో నెలకు ఒకరికి ఆరు కిలోల బియ్యం ఇస్తుండు. 24గంటల కరెంట్ వ్యవసాయానికి ఇస్తున్నడు. తెలంగాణ సర్కారు లేనప్పుడు ఎకరం వేలల్లోనే అమ్ముడయ్యేది. ఇప్పుడు రూ.కోట్లలో పలుకుతోంది. ధరణితో రైతులకు భూ పంచాయతీలు లేకుండా చేసిండు. ఇట్లాంది పాలననే మళ్లీ కావాలె.
– సి.మశన్న, చంద్రకల్