మహబూబ్నగర్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఖాళీ జాగా ఉంటే రూ.3 లక్షలతో ఇల్లు కట్టిస్తమని చెప్పినం.. రానున్న 15 రోజుల్లో ఎమ్మెల్యేల నాయకత్వంలో ఇండ్లు కూడా మంజూరు చేస్తాం..’ అని పాలమూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఇల్లు లేని నిరుపేదల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్రూం ఇండ్లు కాకుండా.. అదనంగా ఈ పథకం రూపుదిద్దుకోనున్నది. ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వారిని ఈ స్కీంలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. నియోజకవర్గానికి 3 వేల యూనిట్ల చొప్పున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 42 వేల ఇండ్లు కట్టివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకానికి ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు కలిపి రూ.1,260 కోట్లు ఖర్చు కానున్నది. అయితే, వెనుకబడిన పాలమూరు జిల్లాకు నియోజకవర్గానికి అదనంగా వెయ్యి ఇండ్ల చొప్పున మంజూరు చేస్తానని సీఎం ప్రకటించారు.
ఈ లెక్కన అదనంగా మరో 14 వేల ఇండ్లు మంజూరు కానున్నాయి. దీనికి రూ.420 కోట్లు కానున్నది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాకు ముఖ్యమంత్రి ప్రకటించిన అదనపు కోటా కలిపి 56 వేల ఇండ్లు మంజూరయ్యే అవకాశం ఉన్నది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో వచ్చే అవకాశం ఉన్నది. గ్రామాలు, పట్టణాల్లో జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు ఈ పథకం వరంగా మారనున్నది. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల పేరున ఇరుకుగా ఉండే జాగాల్లో పెంకుటిల్లు కట్టించి ఇచ్చారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూపకల్పన చేశారు. పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాలు, మండలాలు, గ్రామాల్లో ఈ ఇండ్లను నిర్మించి ఇచ్చారు. ప్రతి ఇంట్లో ప్రభుత్వ పథకాల ద్వారా ఒక్కరైనా లబ్ధి పొందుతున్నారు. చాలా మందికి సొంతిల్లు అనేది కలగానే మారింది. దీంతో డబుల్బెడ్రూం ఇండ్లకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. ఖాళీ జాగా ఉన్న వారికి ఆర్థిక సాయం చేస్తే సొంతిల్లు లేనివారు ఎవరూ ఉండరు. ఎమ్మెల్యేలు ఏ గ్రామానికి వెళ్లినా చాలా మది ఇండ్లు కావాలని దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ నూతన పథకంతో ఆ సమస్య కూడా తీరనున్నదని ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఖాళీ జాగా ఉన్న వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందిస్తే లబ్ధిదారులు తమకు నచ్చినట్లు ఇండ్లు కట్టుకుంటారనే ఉద్దేశంతో నూతన పథకానికి అంకురార్పణ చేశారు.
వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయాలనే తపనతో అన్ని నియోజకవర్గాలకు అదనంగా వెయ్యి యూని ట్లు మంజూరు చేశారు. కుల, మత, లింగ బేధం లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. గ్రామాల్లో చాలా మందికి జాగాలు ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్థోమత లేదు. ప్రభుత్వం ఇచ్చే రూ.3 లక్షలతో ఇం టి కల నెరవేర్చుకోవచ్చు. పేదోళ్ల సొంతింటి కలను నేరవేరుస్తున్న సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు – డా.సీ.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల