ఎండుమిర్చి సాగంటే గతంలో ఏపీలోని గుంటూరు గుర్తొచ్చేది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోనూ ఎర్రబంగారం సాగు విస్తీర్ణం పెరిగింది. మార్కెట్లో క్వింటాకు రూ.23 వేల నుంచి రూ.25 వేల వరకు ధర లభిస్తున్నది. పెట్టుబడి ఖర్చులన్నీ పోనూ ఎకరాకూ రూ.75 వేల వరకు ఆదాయం సమకూరుతున్నది. దీంతో గతేడాదికంటే ఈ సారి అధికంగా రైతులు పంటను సాగు చేశారు. ధరలు ఆశాజనకంగా ఉండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఊట్కూర్, డిసెంబర్ 15 : ఎండుమిర్చి సాగు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. మండలంలో ఈఏడాది దాదాపు 500 ఎకరాల్లో రైతులు మిరప పంటను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఆరుతడి పంటలైన వేరుశనగ స్థానంలో మిర్చిపంట సాగువైపు అధికంగా రైతులు మొగ్గు చూపారు. ప్రస్తుతం మార్కెట్లో ఎండు మిరపకు మంచి ధర ఉండడంతో బోరుబావుల ఆధారంగా మిర్చిపంటను పండించారు. ఊట్కూరు మండలకేంద్రంతోపాటు పులిమామిడి, చిన్నపొర్ల, పెద్దపొర్ల, తిప్రాస్పల్లి, నాగిరెడ్డిపల్లి, మొగ్దుంపూర్, అవుసలోనిపల్లి గ్రామాల్లో 500 ఎకరాల్లో సాగు చేసిన మిరప పంట ప్రస్తుతం లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం మార్కెట్లో ఎండు మిరప క్వింటాకు రూ.23వేల నుంచి రూ.25వేల వరకు ధర పలుకుతున్నది. రైతులు పండించిన ఎండు మిర్చిని ఖమ్మం, కర్నూల్, గుంటూరు మార్కెట్కు తరలిస్తున్నారు. ఎకరా పంట సాగుకు మిరప నారు, మందులు, ఎరువుల కొనుగోలు, కలుపు తీత పనులకు మొత్తం కలిపి రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడి అవుతోంది. పెట్టుబడులు పోను రైతుకు ఎకరాకు రూ.75వేల వరకు ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు.