నాగర్కర్నూల్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : తింటున్న కొద్దీ తినాలనిపించే పండ్లు సీతాఫలాలు. చలికాలంలో మాత్రమే లభించే ఈ పండ్లు పోషక విలువలకూ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి దసరా ముందు నుంచే మార్కెట్లో పండ్లు విక్రయిస్తున్నారు. అయితే, గతంతో పోలిస్తే పండ్ల అమ్మకాలు, కొనుగోళ్లు బాగా తగ్గాయి. కొల్లాపూర్, జడ్చర్ల, మహబూబ్నగర్, అమరచింత, వనపర్తి వంటి పలు ప్రాంతాల్లో సీతాఫలం చెట్లు బాగా ఉండేవి. వ్యవసాయ భూముల విస్తీర్ణం పెరగడం, గుట్టలు తవ్వడంతో సీతాఫలం దిగుబడిపై ప్రభావం చూపుతున్నది. పదేండ్ల కిందట రూ.50కే బుట్ట పండ్లు ఉండగా.., ఇప్పుడు రూ.400 నుంచి రూ.500 వరకూ అమ్ముతున్నారు. సీజనల్ పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంతో ఈ పండ్లకు ధర ఎక్కువైనా కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అయితే, సామాన్యులు మాత్రం కొసరి కొసరి తినే పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా మంది ఇంటింటికీ తిరుగుతూ పండ్లను విక్రయిస్తున్నారు. ఈ పండ్లల్లో విటమిన్ ఏ, సీ, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ తదితర విటమిన్లు ఉంటాయి. ఈ పండ్లను క్లస్టర్ ఆపిల్గానూ పిలుస్తారు. 100 గ్రాముల పండులో 1.6గ్రాముల కొవ్వు, 26.2గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2.4 గ్రాముల పీచుపదార్థాలు లభిస్తాయి. ఇది మెగ్నీషియం, క్యాన్సర్, మూత్రపిండాల, చర్మ వ్యాధులు, వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తుంది. అలాంటి ఈ పండ్లను ఈ సీజన్లో కచ్చితంగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, మధుమేహవ్యాధి గ్రస్తులు వారంలో సగం పండును మాత్రమే తినాలి.
సీతాఫలంతో ప్రయోజనాలు..
సీతాఫలం పండులో ఉన్న 100 గ్రాముల గుజ్జు నుంచి 94 క్యాలరీల శక్తి లభిస్తుంది.
కెరోటిన్, థైమీన్, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ సీ లభిస్తుంది.
ఈ పండును నేరుగా తినడం వల్ల గుజ్జు ద్వారా నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. జీర్ణక్రియ వేగమవుతుంది. ఒత్తిడి, డిప్రెషన్లను దూరం చేస్తుంది.
పండు గుజ్జును రసంలా చేసి పాలలో కలిపి పిల్లలకు తాగి స్తే సత్వర శక్తి లభిస్తుంది. గాయాలు త్వరగా మానేలా చేస్తుంది.
ఎదిగే పిల్లలకు రోజూ ఒకట్రెండు పండ్లు తినిపిస్తే బలంతోపాటు ఫాస్పరస్, కాల్షియం, ఇనుమువంటి పోషకాలు లభిస్తాయి. ఇవి ఎముకలకు ఎంతో బలం.
మలబద్ధకంతో బాధపడేవారికి దివ్య ఔషధంగా నిలుస్తుంది.
ఎనీమియాను నివారిస్తుంది.
గుండెరోగులు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవాళ్లు
అల్పాహారంగా తీసుకుంటే మంచిది. కండ్లకు ఎంతో మంచిది.
డైటింగ్ నియమాలు పాటించే వాళ్లకు చాలా ఉపయోగకరకం.
పండులోని సల్ఫర్ చర్మవ్యాధులను తగ్గిస్తుంది. ఇందులోని గుజ్జు శరీరంలోని క్రీములను, వ్యర్థపదార్థాలను బయటకు పంపిస్తుంది.
ఇక పండుతోపాటు ఆకులను మెత్తగా నూరి పసుపు కలిపి మానని గాయాలు, గజ్జి, తామర ఉన్నచోట రాస్తే మాయమవుతాయి.
ఆకులను మెత్తగా నూరి బోరిక్ పౌడర్ కలిపి మంచం, కుర్చీల
మూలల్లో ఉంచితే నల్లుల బెడద తప్పుతుంది.
సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు.
గర్భిణులు ఈ పండును ఎక్కువగా తినాలి. కాకపోతే తినొద్దు. గర్భస్రావం కాకుండా, నొప్పులు ఎక్కువ కాకుండా చేస్తుంది.
జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ ఉన్న వాళ్లు తక్కువగా తినాలి.
మెగ్నీషియం శరీరంలోని కండరాలకు విశ్రాంతిని ఇస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.
ఖాళీ కడుపుతో తినొద్దు. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.
ఈ పండు గుజ్జుతో స్వీట్లు, జెల్లీలు, ఐస్క్రీంలు, జామ్లు తయారు చేస్తారు.