గద్వాలటౌన్, మే 26 : ప్రతి మనిషిలో ఓ కళ ఉంటుంది, ఆ కళను పదిమందికి పంచినప్పుడే గొప్ప పేరు వస్తుందని పద్మశ్రీ కిన్నెర మొగులయ్య అన్నారు. దివంగత సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు ప్రవీణ్, సంజీవ్ జ్ఞాపకార్థం జిల్లా కేంద్రంలోని సోమనాద్రి స్టేడియంలో ప్రవీణ్ సేవా సమితి ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నీ గురువారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ పోటీలకు మొదటి రోజు మొగులయ్యతోపాటు ఎస్పీ రంజన్త్రన్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగులయ్య మాట్లాడుతూ కళను నమ్ముకున్నవారికి ఎప్పటికైనా గుర్తింపు వస్తుందన్నారు. అందుకు తానే ఉదాహరణ అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ నచ్చిన రంగాన్ని ఎంచుకుని రాణించినప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగగలుగుతామని చెప్పారు.
అనంతరం సీనియర్ క్రీడాకారుల చిత్రపటాలకు నివాళులర్పించి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్పీ రంగస్వామి, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నాయకులు బండల వెంకట్రాములు, విజయ్కుమార్, ప్రవీణ్సేవా సమితి అధ్యక్షుడు ఇండికా శివ, బాలరాజుగౌడ్, త్యాగరాజు, నరసింహరాజు, హలీం, పాండు, వెంకటేశ్, గోవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోటీల్లో 12జట్లు..
పోటీల్లో తమిళనాడు, బెంగళూరు, గ్లోబల్ హైదరాబాద్, కడియం, హుబ్లీ, రం గారెడ్డి, నాందేడ్, సికింద్రాబాద్ ఎఫ్సీ, ఫలక్నుమా, గద్వాల నుంచి మొతం 12 జట్లు ఉంటాయి. మొదటి రోజు ఫలక్నుమా, బెంగళూరు జట్లు పోటీ పడగా ఫలక్నుమా జట్టు బెంగళూరు జట్టుపై 2గోల్స్ ఆధిక్యంతో విజయం సాధించింది.